
బోఫోర్స్ భూతం మరోసారి నిద్రలేచి వికటాట్టహాసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నిద్రకు దూరం చేస్తోంది. అధినాయకురాలి ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ముంచుకొస్తోంది. మచ్చలేని నీతిమంతుడుగా ఇంతకాలం పేరు నిలబెట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంపైన మరో మరక పడుతోంది. స్వయంగా అవినీతికి ఒడిగట్టకపోయినప్పటికీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న ప్రధానిగా మన్మోహన్ ను చరిత్ర బోను ఎక్కించనున్నది. దేశంలో అత్యున్నత పరిశోధన సంస్థ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పాలకుల చేతిలో ఆయుధమని ఇంకోసారి నిరూపించుకున్నది. నేరపరిశోధన చేయకుండా, అధికార పార్టీ లేదా అధికార కూటమి ప్రత్యర్థులను వేధించడానికీ, అస్మదీయులను రక్షించడానికీ అక్రమంగా పనిచేస్తున్న జేబు సంస్థగా తాజా ముద్ర వేయించుకున్నది.
సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఇటాలియన్ వ్యాపారి అట్టావియో కత్రోకీకి బోఫోర్స్ ముడుపులు ముట్టినట్టు ఇన్ కంటాక్స్

ఇక నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఇంతకాలం ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మన్మోహన్ పరిస్థితి మరీ దయనీయం. కత్రోకీపైన కేసును నీరు కార్చే ప్రక్రియను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పర్యవేక్షించడం వల్ల ఆయన ఈ వ్యవహారంలో తప్పుకోవడానికి అవకాశం లేదు. సాక్ష్యాధారాలు లేని కారణంగా కత్రోకీ ప్రాసిక్యూషన్ ను విరమించుకుంటున్నట్టు 2009 సెప్టెంబరులో మన్మోహన్ సింగ్ సర్కార్ సుప్రీంకోర్టుకు చెప్పింది. వాజపేయి ప్రధానిగా ఉండగా 2003లో ప్రభుత్వం ఒత్తిడి కారణంగా లండన్ లో కత్రోకీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. 2006లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా ఆంక్షలు ఎత్తివేసి లండన్ బ్యాంక్ ఖాతాకు తిరిగి ప్రాణం పోసింది. ఆ ఖాతా నుంచి కత్రోకీ 21కోట్ల రూపాయలు తీసుకోవడానికి వీలు కల్పించింది. కత్రోకీపైన రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించుకోవలసిందిగా సీబీఐకి 2008 అక్టొబర్ లో నాటి అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ సలహా ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం లేకుండా జరిగేవి కావు. పనామా బ్యాంకు ఖాతా ఎవరిదో సీబీఐకి తెలుసు. ప్రధానికి తెలుసు. కానీ కోర్టులకు తెలియదు. ప్రజలకు తెలియదు. కత్రోకీకి ముడుపులు చెల్లించిన మాట నిజమంటూ ట్రిబ్యూనల్ ప్రకటించిన తర్వాత కత్రోకీని రక్షించడానికీ, దేశం నుంచి సురక్షితంగా సాగనంపడానికీ, అతడు ముడుపుల సొమ్మును బ్యాంకు నుంచి తీసుకోవడానికీ, అతనిపైన కేసు ఎత్తివేయడానికీ సహకరించిన ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కాకుండా ఉంటుందా? ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్ సింగ్, ఆయనను నడుపుతున్న సోనియాగాంధీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందా?
ఉన్నత స్థాయిలో ఉన్న ఇద్దరు నేతలతో పాటు ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ సైతం అప్రతిష్ఠపాలు కావడం విశేషం. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీని రక్షించడానికీ, పనామా బ్యాంకు ఖాతాదారుల వివరాలు గోప్యం ఉంచడానికీ ప్రయత్నించి విశ్వసనీయతను కోల్పోయిన సీబీఐ మరికొన్ని కేసులలో కూడా ప్రభుత్వానికీ, పాలకవర్గానికీ లొంగి దర్యాప్తు చేయకుండా వాస్తవాలను సమాధి చేసింది. ఆరుషి, హేమరాజ్ హత్య కేసు, రుచిక గిర్హోత్రా ఆత్మహత్య కేసు, 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ పాత్రను నిర్ధారించే కేసు వంటి కేసులలోనూ సీబీఐ పాత్ర శోభాయమానంగా లేదు. జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది. ఆరుషి హత్య కేసులో హంతకులను పట్టుకోకపోగా దంతవైద్యుడు తల్వార్ కుటుంబాన్ని అనవసరంగా బజారుకు ఈడ్చి సీబీఐ అదనంగా అపకీర్తి మూటకట్టుకుంది. బహుజన సమాజ్ నేత మాయావతినీ, సమాజ్ వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ నీ, జనతాదళ్ నాయకుడు లాలూప్రసాద్ నీ బెదిరించి లొంగదీసుకోవడానికి సీబీఐని ఒక సాధనంగా యూపీఏ నాయకత్వం వినియోగించుకుంటున్నది. యూపీఏకి విధేయంగా ఉన్నంత కాలం మాయావతిపైన కేసులు కానీ ములాయంపైన కేసులు కానీ లాలూపైన కేసులు కానీ ముందుకు సాగవు. యూపీఏ తో విభేదించి ప్రతిపక్ష శిబిరంలో చేరిన వెంటనే వారిపై కేసులు మళ్ళీ మొదలవుతాయి. ఈ బాగోతాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులు, రచయితలు సైతం సీబీఐ నిర్వాకంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సీబీఐని భ్రష్టుపట్టించిన ఘనత కూడా యూపీఏ సర్కార్ కే దక్కుతుంది.
అవినీతిని అరికట్టవలసిన యూపీఏ అధ్యక్షురాలు, ప్రధాని, సీబీఐ అవినీతితో రాజీపడితే ఈ దేశానికి నిష్కృతి ఉంటుందా? అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం యూపీఏ సర్కార్ ను సరైన మార్గంలో నడిపించగలుగుతుందా? టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని-జేపీసీని- నియమంచడానికి అంగీకరించకపోతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా? ఈ పరిస్థితులు మధ్యంతర ఎన్నికలకు దారి తీస్తాయా? మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ రాదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. యూపీఏ సర్కార్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలనే అస్త్రాలుగా చేసుకొని ప్రచార యుద్ధం సాగించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఇటీవల గువాహతి సమావేశంలో నిర్ణయించింది. ఏ కోణం నుంచి చూసినా కాంగ్రెస్ కు పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. బోఫోర్స్ భూతం మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించనున్నదా? రాజీవ్ గాంధీని గద్దె దింపిన బోఫోర్స్ భూతం ఆయన కుమారుడు రాహుల్ 2014లో అనుకున్న ప్రకారం గద్దెనెక్కకుండా అడ్డుపడుతుందా?
విజయ్ గారు,
ReplyDeleteచాలా మంచి పోస్ట్ . ఇంతవరకూ, నాకు సోనియా తల్లి, సోదరి పేర్లు తెలియదు. తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. మీ శబరిమల యాత్రావిషయాలు తెలియజేయగలరు.
~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com