Monday, January 30, 2017

దీపం వారి దైవం
ఆదివాసీల అరుదైన ఆరాధన
గోండుల జంగూబాయి జాతర
 ఆదివాసీలకు.. ప్రకృతికి విడదీయరాని బంధం. వారి అలవాట్లు.. ఆచారాలు ప్రకృతితోనే ముడివడి ఉంటాయి. కొండకోనల్లో జీవనం.. అడవే జీవనాధారం. భాష.. వేషధారణ.. పూజలు... పండుగలు... జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ వీరి శైలి విభిన్నం.. ప్రకృతితో మమేకం. ఈకోవకు చెందిందే జంగుబాయి జాతర.

  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పరందోళి గ్రామ సమీపంలోని గోండుతెగకు చెందిన గిరిజనులు ఏటా జంగుబాయి జాతరను నిర్వహిస్తారు. పుష్య మాసంలో నెల్లాళ్లపాటు జరిగే  రోజుల పాటు జంగుబాయి దేవతని కొలుస్తారు.
దేవతనగానే, మానవాకారం, నాలుగో, ఎనిమిదో చేతులు.. వాటికి రకరకాల ఆయుధాలు అని ఊహించేస్తాం. కానీ ఇక్కడి వారికి దేవత అంటే ఓ వెలుగు. అవును, చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగూబాయి దేవతగా వీరు ఆరాధిస్తారు. నది పక్కన ఎత్తైన కొండ మధ్యలోని గుహలోపలి భాగంలో కాంతులు వెదజల్లే దీపమే జంగూబాయి దేవత. ఆదీపం ఉంచిన స్థలమే జంగూబాయి గద్దె. గుహలోపల పాక్కుంటూ వెళితేనే గానీ, అక్కడికి చేరుకోలేము.వీరు కొలిచే దేవతకు అసలు ఆకారమే ఉండదనుకోకండి. గుహ వెలుపలున్న గ్రామంలో చిన్న కప్పులో ఉండేదే పోచమ్మ దేవత.. అక్కడ పసుపు.. కుంకుమలు అద్దిన రెండు చెక్కలు కనబడతాయి. ఆ ప్రదేశాన్ని ఆదివాసీలు.. కోత పరంధోళి అంటారు.

జాతర సమయంలో ఆ దేవత రక్షణ కోసం ఎనిమిది గోత్రాలకు సంబంధించిన తెగలు పనిచేస్తాయి. గోత్రాన్ని బట్టి పని విభజన చేసుకుంటూ జాతరను నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. ఈ మేరకు తమ గోత్రం వారు దేవత ముందు గౌడి పూజ  చేస్తారు. 'మరప' గోత్రం వారు ప్రధాన పూజారులుగా...కొదప గోత్రం వారు గ్రామ పంచాయతీ పెద్దలుగా వ్యవహరిస్తారు. 'వేట్టి' గోత్రం వారు పటేళ్లలాగా  వ్యవహరిస్తారు.  సల్లాం గోత్రం వారు దేవతకి చిట్టచివరి పూజ చేస్తారు.  సేరేకుమ్‌రా గోత్రం వారు కూడా  కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాయ్‌సిడం గోత్రం గోండులు దేవతకి జనం విడిచిన పశువుల బాధ్యత తీసుకుంటారు. 'మందాడ' గోత్రం వారు దేవస్థానానికి వెళ్లిన నాలుగు శాఖల వారికి కండువాలు, శాలువాలను ఇస్తారు. వీరు మాత్రమే కాకుండా... కాక్‌లే  గోత్రం వారు కూడా దేవత కోసం విధులు నిర్వహస్తారు. నెలరోజుల పాటు జరిగే.. ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. వీరి సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది.
అయితే జాతరను హైజాక్‌ చేయడానికి.. సొమ్ము చేసుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే బయట నుంచే వచ్చే భక్తులు కోసం ఇక్కడ చెట్లను నరికివేశారు.. పుట్టలను నేలమట్టం చేసేశారు. పెద్దపెద్ద వాహనాలు గ్రామంలోకి వస్తున్నాయి.. దీనిపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునికత పేరుతో ఆదివాసీ సంస్కృతిపై దాడి జరుగుతోందన్న భావనా వారిలో వ్యక్తమవుతోంది.