Sunday, August 11, 2019

తాపత్రయం ఎందుకు..?

తాపత్రయం అంటే ఆత్రుత కాదు.. ఈ పదంలో నిగూఢమైన అర్థం దాగుంది.. ఈ లింక్ ప్రెస్ చేసి వినండి. తాపత్రయం తొలగుతుంది. https://www.youtube.com/watch?v=I9DYUNWnVQU&feature=youtu.be





దీన్ని గ్రామాభివృద్ధి అందామా..?


పంటలు లేని కాలంలో.. ఖాళీ సమయాల్లో యువకులు.. వృద్ధులూ రచ్చబండ దగ్గరో.. గుడి వసారాలోనో కూర్చుని అష్టాచెమ్మా, పులి-మేక లాంటి ఆటలు ఆడేవారు. కాలం మారింది. నేటి యువకులు.. ఇట్లాంటి ఆటలకూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. కర్నాటకలోని మా స్వగ్రామం హచ్చొళ్లికి వెళ్లినప్పుడు.. అక్కడి యువత.. ఖాళీ సమయాన్ని ఇదిగో ఇలా సెల్ ఫోన్ లో ఆటలు ఆడుతూ కనిపించింది. విలేజ్ డెవలప్ మెంట్ అంటే ఇదేనా..?https://www.youtube.com/watch?v=9zVaKBV-IUI&feature=share

Monday, November 26, 2018


దుర్గగుడి ఫ్లైఓవర్ : రాష్ట్రానికి కేంద్రం వార్నింగ్
విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పనుల్లో జాప్యం వల్ల ఫ్లై ఓవర్  బడ్జెట్ అంచనా భారీగా పెరిగిపోతోందని కేంద్రం ఆగ్రహంగా ఉంది. అందుకే, కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇక ముందు ప్రాజెక్ట్ ఆర్థిక భారాన్ని మోయలేమని తేల్చేసింది. దీంతోపాటే, వంతెన నిర్మాణాన్ని వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేసి తీరాలని హుకుం కూడా జారీ చేసింది.
తూతూ మంత్రం పనులే..!

విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం
, రెండున్నర కిలోమీటర్ల మేర ఆరు వరుసల వంతెన, నాలుగు వరుసల దారి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనికోసం రూ.448.60 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌తో, 2015 డిసెంబర్ 27న సోమా కన్ స్ట్రక్షన్ సంస్థ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టింది. 2016 నాటికి పూర్తి కావాలన్నది తొలి లక్ష్యం. కానీ మూడేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతునే ఉన్నాయి.
పదే పదే డెడ్‌లైన్‌లు :
సీఎం చంద్రబాబు దుర్గగుడి పైవంతెన పనులను చాలాసార్లు సమీక్షించారు. సుమారు 10 సార్లు డెడ్‌లైన్లు విధించారు. సీఎం సీరియస్ అయినప్పుడు ఒకటి రెండు రరోజులు పనులు వేగం అందుకోవడం, తర్వాత జోరు తగ్గడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ కేవలం 70 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పని చకచకా సాగుతుంటే, ప్రధానమైన దుర్గగుడి పైవంతెన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టిన సోమ సంస్థ ఈ చిన్న ప్రాజెక్ట్ విషయంలో ఇంత జాప్యం చేస్తుండడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసహనంగానే ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య ఇంతింత కాదు
పోలీస్, రవాణా, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో ఓ సర్వే ప్రకారం దుర్గగుడి మీదుగా నిత్యం 57 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీన్నిబట్టే బెజవాడలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ రోజూ పరిపాటిగా మారింది. ఈసారైనా డెడ్‌లైన్ ప్రకారం ఫ్లైఓవర్‌ పనులు పూర్తయి, బెజవాడ ప్రజలకు ఊరటనిస్తాయో లేదో చూడాలి.

Wednesday, November 14, 2018

గురూ.. భలేగుందే..!



() ఈ చిత్రాన్ని చూస్తే చేయి తిరిగిన కళాకారుడు.. అద్భుతంగా గీసిన చిత్రం అనిపిస్తోంది కదూ.. కానే కాదు. అద్భుతంగా.. వినూత్నంగా వర్ణరంజితంగా ఉన్న ఈ మేఘాల సమూహం.. గురుగ్రహానికి చెందినది. నాసాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్‌ జూనో .. ఈ సుందర దృశ్యాన్ని గురు గ్రహానికి ఏడువేల కిలోమీటర్ల దూరం నుంచి.. క్లిక్‌ మనిపించింది. జోతిష శాస్త్రంలో 

Tuesday, January 30, 2018

ఆదర్శప్రాయుడు... మాణిక్‌సర్కార్‌



  • దేశంలోనే పేద ముఖ్యమంత్రి
  • బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే
  • అఫిడవిట్‌లో వెల్లడి

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌.. దేశంలోనే అత్యంత నిరుపేద ముఖ్యమంత్రి. వినడానికి కాస్తంత విడ్డూరంగా
ఉన్నా... ఇది అక్షరాలా నిజం. ఆయన చేతిలో ఇప్పుడున్న నగదు కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా.. నమ్మిన సిద్ధాంతాలకోసమే సంపాదనను ఖర్చు చేస్తోన్న ఆదర్శ రాజకీయవేత్త మాణిక్‌ సర్కార్‌.

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కారు.. తనదైన విభిన్నశైలితో.. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం దక్కితేనే.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడబెట్టే ఈ రోజుల్లో.. నమ్మిన సిద్ధాంతాలతోనే.. ముఖ్యమంత్రి హోదాలోనూ నిజాయితీతో.. స్వచ్ఛంగా.. జీవిస్తున్నారు మాణిక్‌ సర్కార్.

త్రిపుర రాష్ట్రానికి 1998లో తొలిసారి ఎన్నికైన మాణిక్‌ సర్కార్.. అప్రతిహతంగా ఐదు పర్యాయాలూ ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల వేళ... ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో.. తనవద్ద కేవలం తొమ్మిది వేల ఏడువందల రూపాయలు మాత్రమే నగదు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా.. అప్పట్లోనే.. దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో జరుగుతోన్న ఎన్నికల్లో మాణిక్‌సర్కార్‌ ధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేసందర్భంలో.. ఆయన ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. అందులో.. తన బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అంటే, 2013 ఎన్నికల నాటితో పోలిస్తే.. ఆయన వద్దనున్న బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గణనీయంగా తగ్గిపోయింది. అంటే గడచిన ఐదేళ్లలో ఆయన మరింత పేదవాడిగా మారిపోయారని అర్థమవుతోంది.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగుతోన్న మాణిక్‌ సర్కార్.. ముఖ్యమంత్రిగా తనకు వచ్చే వేతనం 26వేల 315 రూపాయలను పార్టీ నిధుల కిందే జమ చేస్తూ వస్తున్నారు. తన జీవనానికి గాను, పార్టీ నుంచి ప్రతి నెలా 9వేల ఏడు వందల రూపాయలు పొందుతున్నారు. మాణిక్‌ సర్కార్‌ సతీమణి పాంచాలి భట్టాచార్జీ రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి. ఆమె చేతిలో మాత్రం 20వేల నగదు ఉంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూపంలో వచ్చిన పన్నెండు లక్షల 15వేల రూపాయల నగదు ఆమె బ్యాంకు ఖాతాలో ఉంది.

మాణిక్‌సర్కార్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ... అతి సాధారణవ్యక్తి మాదిరిగా జీవిస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌కు కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడగా లేదు. బయటికి వెళ్లేప్పుడు, రిక్షాల్లోనూ.. రైల్వే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయాలు అనగానే.. దోపిడికి దగ్గర దారి అని భావించే ఎందరో నాయకులకు.. మాణిక్‌ సర్కార్‌ నిబద్ధత.. జీవనశైలి నిస్సందేహంగా ఆదర్శప్రాయమే. 

Thursday, November 23, 2017

ప్రాణదాన కేంద్రం.. బెజవాడ ప్రభుత్వ వైద్యాలయం
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి
ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు అంటే..  ప్రాణాలు తీసే యమదూతలు అన్నది నిన్న మొన్నటిదాకా అందరిలాగానే, నాలోనూ ఉన్న అభిప్రాయం. కానీ.. అక్టోబర్ 26తో.. అది పటాపంచలైంది. నాది ఒట్టి దురూహ అని.. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి నిరూపించింది. యమపురి ద్వారాలుగా కాకుండా.. ప్రాణదాన కేంద్రాలుగా ప్రభుత్వాసుపత్రులు భాసిల్లుతున్నాయన్న సత్యం నాకు తెలిసొచ్చింది. అవును.. 30 ఏళ్ల నా జర్నలిజం కెరీర్ సాక్షిగా ఇది నిజం.. అక్షరాక్షర సత్యం.
మా తమ్ముడు ప్యాంక్రియాస్ బాధితుడు :
మా తమ్ముడు మురళీకృష్ణ
మా తమ్ముడు పి.మురళీకృష్ణ,  pancreas (క్లోమం) వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నాడు. క్లోమ గ్రంథుల్లో నుంచి ద్రవాలు ఊరని పరిస్థితి. క్లోమం రాళ్లతో నిండిపోయి.. గట్టిగా తయారైంది. దీంతో షుగర్ లెవెల్స్ దారుణంగా పెరిగిపోయాయి. తిన్న రెండో నిమిషమే.. మల విసర్జనకు వెళ్లాల్సిన దుస్థితి. తిన్నది ఏదీ ఒంటికి పట్టకుండా.. అస్తిపంజరంలా మారాడు. ఎమ్మిగనూరు సహా కర్నూలు జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో చూపించుకున్నాడు. ప్రతివారూ మందులు ఇచ్చి పంపడమే..! ఆపరేషన్ అంటే ఎవరూ ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో తెలిసిన వారి ద్వారా.. మా తమ్ముడు, విజయవాడ వెళ్లి.. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాడు.
ప్రాణదాత డాక్టర్ ఎం.విశ్వనాథ్ :
సతీసమేతంగా డాక్టర్.ఎం.విశ్వనాథ్
మాతమ్ముడి అదృష్టవశాత్తు.. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్.ఎం.విశ్వనాథ్ గారు తారసిల్లారు. ప్యాంక్రియాసిస్ కు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెంటనే ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. ఆపరేషన్ కు ముందు.. తర్వాత.. మా తమ్ముడికి 95శాతం మేర ఖరీదైన వైద్య పరీక్షలన్నీ ఆసుపత్రిలోనే చేయించారు. మందులు కూడా ఆసుపత్రిలోనే సమకూర్చారు. మరీ తప్పని పరిస్థితుల్లోనే, బయటి నుంచి మందులు, శస్త్రచికిత్సకు అత్యవసరమైన ఒకటి రెండు వస్తువులు మాత్రమే నాతో బయటి నుంచి తెప్పించారు. ఆపరేషన్ ముందు మా తమ్ముడి ఒంట్లోని షుగర్ కంట్రోల్ చేసేందుకు డాక్టర్ విశ్వనాథ్ గారి బృందం పడ్డ తంటాలు అన్నీ ఇన్నీ కావు. మత్తుమందు (anasthesia) నిపుణులు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ కు ఎక్కడ అంగీకరించరో అని.. మాకన్నా.. డాక్టర్ విశ్వనాథ్ గారు పడ్డ హైరానా అంతా ఇంతా కాదు. పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉన్నందున.. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలన్న వారి తపన కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఆత్మీయ బంధువులు.. ఈ వైద్యులు :

నిజానికి ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అయినా.. రోగంతో తన వద్దకు వచ్చిన వారిని నయం చేయకుండా పంపరాదన్న భావనతో.. డాక్టర్ విశ్వనాథ్ గారు, మా తమ్ముడి కేసును చేపట్టినట్లుగా నాకు అనిపించింది. తమ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ పురుషోత్తం గారి నిర్దేశకత్వంలో.. ఆపరేషన్ అనుకున్నప్పటి నుంచే.. డాక్టర్ విశ్వనాథ్ గారు, ఆయన బృందంలోని డాక్టర్ శ్వేత గారు మొదలైన వారంతా, మా తమ్ముడిపై కనబరిచిన శ్రద్ధను మాటల్లో చెప్పలేను. . అప్పట్లో నాకు తెలియదు కానీ.. తర్వాత అర్థమైంది.. మా తమ్ముడినే కాదు.. తమ దగ్గరకు వ్యాధితో వచ్చిన ప్రతివారినీ ఈ బృందం అంతే జాగ్రత్తగా, శ్రద్ధగా కనిపెట్టుకుంటారని. డాక్టర్ శ్వేత గారైతే.. ఆపరేషన్ కు ముందు రోజు.. ఆరోగ్యశ్రీ కార్డు నమోదు ప్రక్రియను కూడా స్వయంగా దగ్గరుండి చేయించారు. ఆపరేషన్ తర్వాత కూడా.. నాలుగు రోజులపాటు ప్రతి రెండు గంటలకోసారి.. మా తమ్ముడి పరిస్థితిని చూసుకుంటూ వచ్చారు. నర్సులు లేకున్నా.. స్వయంగా డాక్టర్లే డ్రెస్సింగ్ తదితరాలు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోవడం నావంతైంది. ప్రతి క్షణం.. పేషెంట్ కు ఇబ్బంది కలగకూడదన్న తపనే వారిలో కనిపించింది. మొత్తానికి ఈ బృందం కష్టంతో.. మా తమ్ముడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అచ్చంగా అమ్మఒడే..!
నేను 10Tv Output Editor అని ఎక్కడా చెప్పుకోలేదు.. ఎవరి రెకమెండేషన్ లు పెట్టించుకోలేదు. కేవలం సాధారణ పేషెంట్ కు ఓ అన్నగానే అక్కడున్నాను. పేషెంట్ పట్ల వైద్యులు కనబరిచే ఆత్మీయతకు సాక్షీభూతంగా నిలిచాను.  మా తమ్ముడిని అమ్మలా లాలించారు.. నాన్నలా పాలించారు.. తోబుట్టువులా ఊరడించారు.. నమ్మరు గానీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోనంత ప్రేమగా చూసుకున్నారు. మా తమ్ముడు ఆపరేషన్ వల్ల కలిగిన నొప్పిని భరించలేక.. లేవలేని పరిస్థితుల్లో.. డాక్టర్లు కాస్త కఠినంగానే హెచ్చరించారు.. మా తమ్ముణ్ణి వారే, బలవంతంగా పైకి లేవదీసి చేయి పట్టుకుని నడిపించారు. ఆ తర్వాత నొప్పి తగ్గేందుకు ఉపశమన మార్గాలనూ చూపారు. కచ్చితంగా ఆపరేషన్ జరిగిన వారం రోజులకే.. డిశ్చార్జి చేసేంతటి మెరుగైన స్థితికి మా తమ్ముడిని చేర్చారు.
పరిశుభ్రతకు ఫిదా..!
మానాన్న క్యాన్సర్ వ్యాధికి చికిత్స సందర్భంగా.. 22 ఏళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తిరిగిన జ్ఞాపకం ఇంకా ఉంది. మరకలు పట్టిన గోడలు.. చీకటి కొట్లను తలపించే గదులు.. ఎక్కడా టార్చి లైటు వేసి వెతికినా కనిపించని పరిశుభ్రత... ఇదీ అప్పటి పరిస్థితి. కానీ విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిని చూస్తే.. కొంపదీసి ఇది కార్పొరేట్ ఆసుపత్రా అన్న అనుమానం కలుగుతుంది. నేను అక్కడ వారం రోజులపాటు మా తమ్ముడికి అటెండెంట్ గా ఉన్నాను. రోజులో 8 సార్లు వార్డులను శుభ్రం చేస్తారు. బెడ్ షీట్స్ కూడా ప్రతిరోజూ శుభ్రమైనవి, చక్కగా ఉతికినవి మారుస్తారు. ఫ్యాన్లకు.. గోడలకు.. ఉన్న బూజును ప్రతి ఆదివారమూ పరిశుభ్రం చేస్తారు.
సేవలు అద్భుతం
మహాప్రస్థానం వాహనం
చెబితే నేనూ నమ్మేవాడిని కాను కానీ.. స్వయంగా చూశాకే అర్థమైంది.. అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యమిస్తారో. ఆసుపత్రి వార్డుల్లోనే కాదు.. పరిసరాల్లోనూ అంతే శుభ్రత కనిపిస్తుంది. పేషెంట్ల బంధువులు చెత్తను పారేయడం ఆలశ్యం.. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే తొలగించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన సరికొత్త అంబులెన్స్ ల గురించీ చెప్పాలి. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి.. ఇక్కడికి తెచ్చేలోపే మరణించిన వారిని.. వ్యాధిని నయం చేయలేని స్థితిలో వచ్చి.. ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలను.. బెజవాడ పరిసరాల్లోని వారి ఇళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం అంబులెన్స్ వ్యవస్థ కూడా అద్భుతం. (మానాన్న మరణించినప్పుడు.. హైదరాబాద్ నుంచి మానాన్న మృతదేహాన్ని మా ఊరికి తరలించేందుకు నేను పడ్డ పాట్లు.. గుర్తుకొచ్చాయి. అప్పట్లో ఈటీవీ జీఎం బాపినీడు గారు కంపెనీ వాహనాన్ని సమకూర్చకుంటే నా పరిస్థితి ఏంటో తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు ఝల్లుమంటుంది). మృతుల బంధువులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ నిజంగా ఆపన్నహస్తమే.
ప్రతి చోటా ఇలాగే ఉంటుందా..? 

ప్రతి ఆసుపత్రిలోనూ పేషెంట్ల మీద ఇలాంటి శ్రద్ధే ఉంటుందా..? ఏమో నాకు తెలియదు. నేను చూసింది.. మీతో పంచుకుంటోందీ.. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలోని మంచి పరిస్థితిని.  వైద్యులకు.. ముఖ్యంగా ప్రభుత్వానికి బాకా ఊదేందుకు రాసిన రాతలు కావు. మా తమ్ముడికి ప్రాణదానం చేసిన వైద్యుల అంకిత భావం గ్రహించి..  కృతజ్ఞతతో నిండిన నా మనసులోని భావాలకు అక్షర రూపం మాత్రమే. మా తమ్ముడు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. జీర్ణవ్యవస్థ పక్కాగా పనిచేస్తోంది. షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ లోకి వచ్చాయి. మా తమ్ముడికి మళ్లీ జన్మను ప్రసాదించిన డాక్టర్ ఎం.విశ్వనాథ్ గారికి మా కుటుంబ సభ్యులందరమూ సదా కృతజ్ఞులము. వైద్యో నారాయణో హరి:

P.VIJAYA KUMAR
Output Editor, 10Tv.,
Hyderabad