Wednesday, March 23, 2011

టిఆర్ఎస్‌ని దువ్వితే చాలు పనై పోద్ది : జస్టిస్‌ శ్రీకృష్ణ

రాష్ట్ర విభజన అంశంపై జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసుల్లో ఇప్పటికే అన్నీ బయటకి వచ్చాయి. అయితే 8వ చాప్టర్‌ని మాత్రం కమిటీ సభ్యులు.. సీల్డ్‌ కవర్‌లో నేరుగా హోంమంత్రి చిదంబరానికి సమర్పించారు. ఇంతకీ ఆ రహస్య నివేదికలో ఏముంది..? ఇంతకాలం అందరినీ వేధిస్తోన్న ఈ ప్రశ్నకు సమాధానాలను హైకోర్టు, ఇవాళ ఓ తీర్పు సందర్భంగా ప్రస్తావించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ చాప్టర్‌ని బహిర్గం చేయాల్సిందిగా ఎం.నారాయణరెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి చాప్టర్‌లోని ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఈ డాక్యుమెంట్‌ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని.. ఇది పబ్లిక్‌ డాక్యుమెంటేనని జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పులోని అంశాల ప్రకారం చూస్తే... జస్టిస్‌ శ్రీకృష్ణ బృందం 8వ చాప్టర్‌లో పలు ఆందోళనలతో పాటు సూచనలనూ చేసింది. వాటినోసారి చూద్దాం.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని
చాప్టర్‌ _ 8 ముఖ్యాంశాలు

రాజకీయ అంశాలు :
  • రాజకీయ పార్టీల నాయకులందరినీ ఏక తాటిపైకి తేవడం
  • తెలంగాణ నాయకులను కీలక పదవుల్లో నియమించడం
  • ఉద్యమానికి మూల కారణమైన టిఆర్‌ఎస్‌ని వీలైనంతగా దువ్వటం
  • తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను అదుపు చేయటం. (కాంగ్రెస్‌ అధిష్ఠానం తమ పార్టీ నాయకులను అదుపులో ఉంచాలి)
  • ఇవన్నీ చేస్తూ.. ఈ అంశంపై విస్తృత చర్చలకు సిద్ధమని కేంద్రం బహిరంగ ప్రకటన చేయాలి.
సాంఘిక అంశాలు :
  • తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య పెచ్చు మీరిపోతుంది.
  • మత ఘర్షణలు కూడా పెరుగుతాయి. (అదెలాగంటే.. బిజెపి ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మరింతగా పాదుకోవాలని ప్రయత్నిస్తోంది. MIM పార్టీని నిలువరించే దిశగా ఆ పార్టీ క్యాడర్‌ ప్రయత్నిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో మత ఘర్షణలకు తావిస్తుంది)
  • హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి సమృద్ధిగా ఉంది. చాలా ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రంలో జిడిపి (తలసరి ఆదాయం) ఎక్కువగానే ఉంది.
సీమాంధ్ర ప్రాంత వాసుల పెత్తనం :
  • తెలంగాణలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, పత్రికలు, మీడియా అత్యధికం సీమాంధ్ర ప్రాంత యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయి.
  • ఈ సంస్థల్లోని కీలక స్థానాల్లో కూడా సీమాంధ్ర ప్రాంత వాసులే ఉన్నారు.
మీడియా గురించి :
  • రాష్ట్రంలో 13 టివి ఛానళ్లు, 5 ప్రధాన వార్తా పత్రికలు ఉన్నాయి.
  • రాజ్‌ న్యూస్‌, హెచ్ఎంటీవీ తప్ప మిగిలిన అన్ని ఛానళ్లు సమైక్యాంధ్రనే సమర్థిస్తున్నాయి.
  • పత్రికాధిపతులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
  • ఆంధ్ర జ్యోతి ఎడిటర్‌ తప్ప మిగిలిన సంపాదకులందరూ సీమాంధ్రకు మద్దతుదారులు.
ఓయు ఘటనలపై :
  • హైదరాబాద్‌లోని జర్నలిస్టుల్లో ఎక్కువ మంది ప్రత్యేక తెలంగాణ కావాలనుకుంటున్నారు. వారిలో అత్యధికులు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల ఆందోళనలను, ఆత్మహత్యలను ఎక్కువ చేసి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటివాటికి కొందరు రిపోర్టర్లే ప్రేరేపిస్తున్నారు.
  • వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని.. ఎక్కువ చేసి చూపవద్దని మీడియాకు సూచించాలి.
శాంతి భద్రతల పరిరక్షణకు :
  • (ఉస్మానియా, కాకతీయ, క్రిష్ణదేవరాయ వర్శిటీల్లో ) పూర్తి సాయుధ బలగాలను దించాలి. విధ్వంసాలను తగ్గించాలి.
  • మూడు ప్రాంతాల్లోని విధ్వంసకర శక్తులను గుర్తించి వారిని అదుపు చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక రచించాలి.
  • అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కారం సాధించాలి.
  • వాదాలు వినిపించే వారి వాదనలు సావధానంగా వినాలి.
  • పదవుల కోసం తహతహలాడే వారిని సంతృప్తి పరచాలి. ఇది చిన్నా చితకా స్థాయిలో ఉండరాదు... ఎక్కువ మూల్యం చెల్లించేదిగా ఐనా ఉండొచ్చు.