
రోశయ్య రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. కొత్త కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. వీటిలో.. జగన్ మాతృమూర్తి, వైఎస్సార్ సతీమణి విజయమ్మకు హోంమంత్రి పదవి రానుందన్న వాదన ఒకటి.
ప్రస్తుత కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నది ఆ వర్గం ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్. సిఎల్పీ సమావేశానికి ముందే.. ఈ వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ విస్తృత స్థాయిలో చర్చించుకున్నారట. అవకాశం వచ్చింది కాబట్టి, జగన్ను ఎందుకు సిఎంను చేయరాదు..? అన్నది ఈ వర్గం ప్రశ్న. ఒకవేళ ఈప్రతిపాదనను అధిష్ఠానం తోసిపుచ్చేటట్లయితే.. జగన్ తల్లి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మను హోంమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్న ప్రతిపాదనను జగన్ వర్గం తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓదార్పు యాత్ర ద్వారా గానీ, మరో కార్యక్రమం ద్వారా గానీ.. ప్రజల్లో వైఎస్సార్పై సానుభూతిని ఎంతకాలం నిలిపి ఉంచగలమన్న అనుమానం జగన్ వర్గాన్ని పట్టి పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ ఉన్న కాలంలో.. ఆయన వీర విధేయులమంటూ చెప్పుకున్న కొందరు నాయకులు.. పదవుల కోసం.. జగన్ వర్గాన్నే విమర్శించడం, ఒకరకంగా జగన్ను అణగదొక్కేందుకు ప్రయత్నించడాలను ఈ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. అందుకే.. రాష్ట్రంలో తక్షణం ఏదో ఒక కీలక పదవిని దక్కించుకోవాలని వీరు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హోంమత్రి పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీలోనూ, అనుయాయుల్లోనూ పట్టును నిలుపుకోవచ్చన్న భావన.. జగన్ వర్గంలో కనిపిస్తోంది. ఈ పదవితో పాటు.. మరికొన్ని మంత్రి పదవులనూ ఈ వర్గం ఆశిస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే.. శాసనసభా పక్షాన్ని చీల్చేందుకూ వెనుకాడేది లేదని వీరు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి సిఎల్సీ అత్యవసర సమావేశం తర్వాత.. పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.





