Wednesday, November 24, 2010

వైఎస్‌ సతీమణి ' విజయమ్మ' హోంమంత్రి..?


రోశయ్య రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. కొత్త కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. వీటిలో.. జగన్‌ మాతృమూర్తి, వైఎస్సార్‌ సతీమణి విజయమ్మకు హోంమంత్రి పదవి రానుందన్న వాదన ఒకటి.

ప్రస్తుత కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నది ఆ వర్గం ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్‌. సిఎల్పీ సమావేశానికి ముందే.. ఈ వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ విస్తృత స్థాయిలో చర్చించుకున్నారట. అవకాశం వచ్చింది కాబట్టి, జగన్‌ను ఎందుకు సిఎంను చేయరాదు..? అన్నది ఈ వర్గం ప్రశ్న. ఒకవేళ ఈప్రతిపాదనను అధిష్ఠానం తోసిపుచ్చేటట్లయితే.. జగన్‌ తల్లి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మను హోంమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్న ప్రతిపాదనను జగన్‌ వర్గం తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓదార్పు యాత్ర ద్వారా గానీ, మరో కార్యక్రమం ద్వారా గానీ.. ప్రజల్లో వైఎస్సార్‌పై సానుభూతిని ఎంతకాలం నిలిపి ఉంచగలమన్న అనుమానం జగన్ వర్గాన్ని పట్టి పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ ఉన్న కాలంలో.. ఆయన వీర విధేయులమంటూ చెప్పుకున్న కొందరు నాయకులు.. పదవుల కోసం.. జగన్‌ వర్గాన్నే విమర్శించడం, ఒకరకంగా జగన్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నించడాలను ఈ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. అందుకే.. రాష్ట్రంలో తక్షణం ఏదో ఒక కీలక పదవిని దక్కించుకోవాలని వీరు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హోంమత్రి పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీలోనూ, అనుయాయుల్లోనూ పట్టును నిలుపుకోవచ్చన్న భావన.. జగన్‌ వర్గంలో కనిపిస్తోంది. ఈ పదవితో పాటు.. మరికొన్ని మంత్రి పదవులనూ ఈ వర్గం ఆశిస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే.. శాసనసభా పక్షాన్ని చీల్చేందుకూ వెనుకాడేది లేదని వీరు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి సిఎల్సీ అత్యవసర సమావేశం తర్వాత.. పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

అనుకున్నదే అయింది..!



అనుకున్నదే అయింది... అసహనం పెరిగిపోయిన రోశయ్య రాజీనామా చేస్తారన్న నా అంచనాయే నిజమైంది. అత్యంత విషాదకర పరిస్థితుల్లో.. వైఎస్సార్‌ మరణించిన మర్నాడే రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఖర్మ ఏమో గానీ.. పదవిలో కూర్చున్నప్పటి నుంచీ సమస్యలే సమస్యలు.

ముఖ్యమంత్రి కాగానే.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు కానీ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. దీనంతటికీ కారణం.. రోశయ్య నేతృత్వంలోని అధికార బృందం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేసే విషయంలో మీనమేషాలు లెక్కించడం.. ఆకారణంగానే బ్యాక్‌వాటర్‌ వెనక్కి తన్ని.. తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలును ముంచెత్తిందని ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ప్రజలను ఆదుకోవడంలో కూడా రోశయ్య సర్కారు విఫలమైందని కర్నూలు జిల్లా వరద బాధితులను కదిలిస్తే అర్థమవుతుంది.
ఏదో ఆ గండం నుంచి గట్టెక్కామనుకునే లోపు.. ఫ్రీజోన్‌ అంశం తెరపైకి వచ్చింది. పోలీసు ఉద్యోగాల నియామకంలో.. హైదరాబాద్‌ ఫ్రీజోనే అని.. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో.. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావన మరింత పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారు. దీక్షకు అనుమతించకుడా.. రోశయ్య సర్కారు, కెసిఆర్‌ను మధ్యలోనే అరెస్టు చేసింది. ఇక అక్కడినుంచి తెలంగాణ అంశం రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. ఈ గొడవ గడచిన పదకొండు నెలలుగా కొనసాగుతూనే ఉంది.

డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన రోశయ్యకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ఆ ప్రకటన.. సీమాంధ్రలో ఉద్యమానికి కారణమైంది. సమైక్యాంధ్ర భావనతో.. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించారు. దీంతో.. తెలంగాణలోని ఆందోళనలు కాస్తా సీమాంధ్రకు మళ్లాయి. ఒక ప్రాంతానికి మద్దతుగా ఏనిర్ణయం తీసుకున్నా.. రెండో ప్రాంతం వారు గొడవకు దిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని వేసింది. తొలుత దీన్ని వ్యతిరేకించినా.. తెలంగాణరాష్ట్ర సమితి, కమిటీ పట్ల గౌరవంగానే వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో.. కొంతకాలంగా ఉద్యమాల కాక తీవ్రత తగ్గింది.

ఓ నాలుగు నెలలు కాస్త ఊపిరి పీల్చుకున్న రోశయ్య సర్కారు.. ఈ కాలంలో, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగారు. మద్యం దుకాణాల వేలం ద్వారా.. అబ్కారీ శాఖకు టార్గెట్లు విధించి, గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. దీంతో పాటే... రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచడం, ఆదాయపన్నుల రూపంలో.. ఇలా ఏ అవకాశం ఉన్నా వదలకుండా ఖజానాకు ఆదాయాన్ని పెంచారు. సహజంగానే, ఖర్చు విషయంలో.. రోశయ్య చాలా పొదుపును పాటించారు. రోశయ్యకు కాస్త బాగా ఉన్న కాలం ఏదంటే.. ఈ నాలుగు నెలలే.
ఈమధ్యలోనే ఆయనకు జగన్‌ గండం ఎదురైంది. ఓదార్పు యాత్ర పేరిట, జగన్‌... అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేని అసమర్థత.. తరచూ తనకు వ్యతిరేకంగా సాక్షిలో వస్తున్న కథనాలు పెంచుతున్న అసహనం.. రోశయ్యలో శాంతాన్ని నశింప చేశాయి.
అధిష్ఠానం ఏదోలా పరిస్థితిని చక్కదిద్దుతుందిలే అన్న భావనతో ఉన్న సమయంలో.. మళ్లీ ఫ్రీజోన్‌ అంశం రోశయ్యకు గండంగా పరిణమించింది. ఎస్‌ఐ పరీక్షల రాత పరీక్ష నిర్ణయం విషయంలో రోశయ్య సర్కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించకుండా.. మిగిలిన ప్రాంతాల్లోనే పరీక్షలు జరుపుతామని ప్రకటించింది. పరీక్షలకు ఫ్రీజోన్‌ అంశానికి ఏమాత్రం సంబంధం లేదని నచ్చచెప్పే ప్రయత్నం ఫలించలేదు. పైగా, దీనికి రాజకీయ పార్టీలూ జత కలవడంతో.. పరిస్థితి మరింత జటిలమైంది. ఉస్మానియా విద్యార్థులు ఆమరణ దీక్షలకు దిగారు. పరిస్థితి తీవ్రరూపంలో దాల్చుతున్న తరుణంలో.. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరీక్షలు వాయిదా వేయించేందుకు సిఎంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ అసహనంలో.. సంయమనం కోల్పోయి.. విద్యార్థులను హుస్సేన్‌ సాగర్‌లో దూకమనండి అన్న అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో రోశయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఎస్‌ఐ పరీక్షలను అన్ని ప్రాంతాల్లోనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది.

వీటికి తోడు, వరంగల్‌లో కాంట్రాక్ట్‌ నర్సులు ఎంజిఎం ఆసుపత్రిలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దాదాపు 36 గంటలు తిండీ తిప్పలు లేకుండా ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగి వచ్చి.. వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చింది. ఈ ఘటన స్ఫూర్తినిచ్చిందని అనుకోను గానీ.. ప్రతివారూ డిమాండ్ల సాధన కోసం బిల్డింగులు, టవర్లు ఎక్కడం ప్రారంభించారు. పారా మెడికల్‌ సిబ్బంది, బిఇడి-2008 అభ్యర్థులు, ప్రభుత్వోద్యోగులు అందరూ రోశయ్య సర్కారును ముట్టడించారు.

వీటన్నింటి నేపథ్యంలో.. ఎంతో సహనంగా.. మీడియా మిత్రుడిగా ఉండే రోశయ్య, ఏకంగా మీడియా ప్రతినిధులమీద కూడా రుసరుసలాడడం మొదలెట్టారు. ఆయన ఏ సభకు వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఘటనలతో 77 సంవత్సరాల వయసులో రోశయ్య ఆరోగ్యం కూడా క్షీణించి పోయింది.

దీనికి తోడు, సాక్షి ఛానల్‌లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కథనం ప్రసారమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ వర్గం గగ్గోలు మొదలుపెట్టింది. ఆ ఛానల్‌లోను, పత్రికలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్‌ వర్గాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా రోశయ్య హడావుడిగా ఢిల్లీ వెళ్లారని భావించారు. అయితే.. అక్కడ ఏంజరిగిందన్న వివరాలు ఇప్పటికిప్పుడు తెలియడం లేదు గానీ.. రోశయ్యే తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అలా ఓ కురువృద్ధుడు.. కాంగ్రెస్‌ సుశిక్షిత సైనికుడు అత్యున్నత పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు రోశయ్యలో, పదవి పోయిందన్న బాధ ఎక్కడో ఓ మూల ఉన్నా.. గొడవలను పరిష్కరించాల్సిన తలనొప్పి తగ్గిందన్న భావన, కాస్తంత ప్రశాంతతనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tuesday, November 23, 2010

రోశయ్యలో పెరుగుతోన్న అసహనం..!

రోశయ్య శాంతస్వభావం... మాటల చమత్కారం.. కనుమరుగై పోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ముప్పిరిగొంటున్న సమస్యలు ఆయనకు శాంతిని దూరం చేస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా, ఆయన ఎక్కడికి వెళ్లినా.. నిరసనలు చుట్టుముడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక తొలి అర్ధ సంవత్సరం విపరీతమైన సమస్యలతో సతమతమయ్యారు. తర్వాత ఓ నాలుగు నెలలు కాస్తంత ప్రశాంతంగానే సాగింది. అయితే.. ఫ్రీజోన్‌, బిఇడి-2008 అభ్యర్థుల అంశాలపై రోశయ్య తీసుకున్న నిర్ణయాలు పరిస్థితులను దిగజార్చాయి. ఎస్‌ఐ రాతపరీక్షల నిర్వహణపై రోశయ్య ద్వంద్వ నిర్ణయం... రాష్ట్రంలో మళ్లీ విభజన చిచ్చును రాజేసింది. అది మొదలు, పారా మెడికల్‌ సిబ్బంది, ఉస్మానియా విద్యార్థులు, బిఇడి అభ్యర్థులు.. ఇలా ప్రతివారూ... ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆత్మహత్యాయత్నాలకు దిగడం... ప్రభుత్వం బెంబేలెత్తి పోవడం ఆనవాయితీగా మారింది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోనే... తనను వ్యతిరేకిస్తున్న జగన్‌ వర్గం తరచూ ఆటంకాలు సృష్టిస్తుండడం.. రోశయ్య చికాకుకు కారణమవుతోంది. సిఎం ఏ జిల్లాకు వెళ్లినా.. సభల్లో వైఎస్‌ను విస్మరిస్తున్నారంటూ.. జగన్‌ వర్గీయులు బహిరంగంగా విరుచుకుపడుతున్నారు. దీంతో.. రోశయ్యలో అసహనం బాగా పెరిగిపోతోంది. ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా, అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వద్ద కూడా ఆయన ప్రశాంతత భగ్నమై పోయింది. స్థానిక నాయకత్వాన్ని విస్మరించారంటూ.. ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై రోశయ్య విరుచుకుపడ్డారు. అనూహ్యంగా ఆయన నోట రాజీనామా మాట కూడా దొర్లింది. అంతేకాదు.. అధికారులు నా మాట వినట్లేదు ఏం చేయమంటారు..? అని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం కాంగ్రెస్‌ కార్యకర్తల వంతైంది. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎలా నడిపిస్తారో మన రోశయ్య గారు. రాష్ట్రానికి (ఉంటే గింటే.. ) ఆ భగవంతుడే దిక్కు.

Saturday, October 23, 2010

తెలుగు హంతకులు...!!



మనం తెలుగోళ్లం.. దురదృష్టవశాత్తూ "తెలుగు భాష" హంతకులను ప్రోత్సహిస్తున్న వాళ్లం. మన భావ వినిమయ సాధనాన్ని ఖండఖండాలుగా చీల్చి చెండాడుతున్న వాళ్లం. ప్రాచీన భాష హోదా దక్కించుకుని దానికి గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన తరుణంలో.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో అమృతతుల్యమైన శబ్దం "తెలుగు"ను విషపూరితం చేస్తున్న వాళ్లం.. అందుకే మనం తెలుగు వాళ్లం. కాకుంటే ఏంటి చెప్పండి.. తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా మనకు చీమకుట్టినట్లయినా ఉందా..? అందుకే మనం తెలుగోళ్లం.

ఆత్మాభిమానం అంటే ఏంటో రుచి చూపించిన ఎన్టీఆర్‌ అంటే తెలుగు వాళ్లకు ఎందుకో అంత కచ్చ. " ఆర్‌ యు మదరాసీ" అన్న స్థాయి నుంచి ఆర్‌ యు ఫ్రమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్న స్థాయికి తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్‌ను.. మరేలనో.. పదే పదే అవమానిస్తున్నారు. ఇవాళ మన భాషను, కేంద్రప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించడం వెనుక... తెలుగుకు ఎన్టీఆర్‌ కల్పించిన విస్తృత ప్రాచుర్యం విస్మరించరానిది. అలాంటి తెలుగువాడికి పదే పదే అదే పనిగా అవమానం జరుగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి.. రాజీవ్‌ గాంధీ పేరును పెట్టారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టండ్రోయ్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు ఎంత గొంతు చించుకు అరచినా వినలేదు. సరే గొంతెండి పోయి వాళ్లే మౌనం పాటించారు. ఈ డిమాండ్‌ సహేతుకమే అయినా.. రాజకీయ రొచ్చులో మన రాయి వేయడం ఎందుకులే అని రాజీవ్‌ పేరుకే మిగిలిన వారూ మౌనంగా ఆమోద ముద్ర వేశారు.

ఇవాళ్టికివాళ మళ్లీ ఎన్టీఆర్‌ కలల సౌధం.. మానస పుత్రిక తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్‌గాంధీ లలిత కళాతోరణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులనూ జారీ చేసేసింది. ఇదెక్కడి దారుణం స్వామీ..! తెలుగు లలిత కళా తోరణం.. ఎన్టీరామారావు మానస పుత్రిక. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ కోసం 1986లో కేవలం మూడంటే మూడు నెలల్లో... దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఐదు వేల మంది ప్రజలకు ఏకకాలంలో కూర్చుని చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడేమో దాన్ని ఇండోర్‌ ఆడిటోరియం గా మారుస్తారంట. సంతోషమే.. మార్చుకోండి. అందులో తెలుగు పేరును తొలగించడం ఏంటి.?

పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు సొంత నిధులతో లలిత కళాతోరణాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతారంట.. ఆ ఖర్చు చేసినందుకు గాను, తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగించి రాజీవ్‌గాంధీ పేరును పెట్టాలని కోరారట. అర్థం పర్థం ఉందా..?

విశాఖ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనయ, ప్రస్తుత కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరితో తిక్కవరపు గారికి రాజకీయ విరోధం ఉంది. 35 సంవత్సరాలుగా తాను స్థిరపడిపోయిన విశాఖలో, ఎక్కడినుంచో వచ్చిన పురంధ్రీశ్వరి ఎంపీగా గెలిచి.. అక్కడి స్థానాన్ని సుస్థిర పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని తిక్కవరపు వారు.. తరచూ పురంధ్రీశ్వరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో... పురంధ్రీశ్వరిపై పైచేయి సాధించేందుకే.. సుబ్బరామిరెడ్డి గారు, తెలుగు లలిత కళాతోరణంలో తెలుగును తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.

నేతలూ దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి.. తెలుగు భాషను హతమార్చాలనుకునే వారిపై పోరాడదాం.. తెలుగును బతికించుకుందాం. కలసి రండి.

Friday, October 22, 2010

నందీశ్వరుడు.. నందమ్మగా మారాడు..!


ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయాలు భలే విచిత్రంగా ఉంటాయి... అనుభవించే వారికి మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. పంచభూతాల్లో అతి కీలకమైన నీటితోనే బతుకును ముడివేసుకున్న మత్స్యకారుల ఆచార వ్యవహారాలు.. ఇలాంటివే. వీరి సంప్రదాయాలను బయటి నుంచి చూసే వారికి భలే ఆసక్తిని కలిగిస్తాయి.
ఆంధ్రా-ఒరిస్సా బెస్తల వేలుపు నందమ్మ
సముద్రం తప్ప మరో గమ్యం తెలియని.. జలధే తప్ప మరో జీవన మర్మం ఎరుగని మత్స్యకారులు ఆచరించే సంప్రదాయాల్లో కీలకమైనది నందమ్మ ఉత్సవం. మహేశ్వరుని వాహనం నంది.. మత్స్యకారుల ఉత్సవాల్లో నందమ్మగా మారిపోయాడు. నంది పుంలింగమైతే.. గోవు స్త్రీ లింగం కావాలి. కానీ ఇవేవీ వీరికి పట్టవు. పార్వతీ పరమేశ్వరులను మోసుకు వచ్చే నందీశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని మత్స్యకారులు నందమ్మగా పూజిస్తారు. ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌లలోని మత్స్యకారులు ఈ పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటారు.
పదకొండు రోజుల పండుగ
మత్స్యకారులు ఈ నందమ్మ ఉత్సవాలను పదకొండు రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ పదకొండు రోజులూ తమకు తోచిన రీతిలో ఉమా మహేశ్వరులను పూజిస్తారు. చివరి రోజున నందీశ్వరుడి విగ్రహంపై, పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదిదంపతుల ఉత్సవమూర్తులను గూడెం నడిబొడ్డున ప్రతిష్ఠించుకుని విశిష్ట పూజలు జరుపుతారు. ఆరోజున నిరాహారులై.. సముద్రపు అలలతో ఆటలాడి.. సంద్రపు నీటిలో స్నానమాడి.. ప్రకృతితో మమేకమై సంబరాన్ని విభిన్నంగా జరుపుకుంటారు.
అక్కడ ముగింపు.. ఇక్కడ శ్రీకారం :
ఒరిస్సాలో కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి రోజుతో ఈ నందమ్మ ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఈ పౌర్ణమి రోజుతో మొదలు పెట్టి పదకొండు రోజులు పండుగ చేసుకుంటారు. ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా భావిస్తారు. వేడుకల చివరి రోజున అంటే పదకొండో రోజున నందమ్మను (నందీశ్వరుని) సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అంతటితో ఉత్సవం పరిసమాప్తమవుతుంది.
వృతికి ఆటవిడుపు :
కోస్తా తీరం వెంబడి ఉన్న 60 వేల దాకా మత్స్యకారులు ఈ పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటారు. నిత్యం చేపల వేటలోనే నిమగ్నమయ్యే వీరు.. నందమ్మ పండుగ నాడు మాత్రం ఆటవిడుపుగా గడుపుతారు. పిన్నా పెద్దా, ఆడా మగా భేదం లేకుండా, ఆడీపాడీ, ఉత్సాహంగా సంబరం చేసుకుంటారు. చివరి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తి భావంతో సముద్ర స్నానాలు చేస్తే.. అవివాహితలకు పెళ్లిళ్లు అవుతాయని, సంసారంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని మత్స్యకారులు నమ్ముతారు. ఈ నమ్మకాల వెనుక వాస్తవాలను వెతకడం కన్నా.. విభిన్నంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించని రీతిలో ఉన్న వీరి ఆచారాన్ని మనమూ మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దాం.

Wednesday, October 20, 2010

ప్రశిష్యుడి నుంచి సమాధి దాకా...

భాషా పదకోశం భలే చిత్రమైంది. శోధిస్తూ పోతే.. కొత్త కొత్త అర్థాలు ఎన్నింటినో అందిస్తూ ఉంటుంది. అర్థ శోధనలో ఎక్కడో ప్రారంభించి మరెక్కడికో చేరుకుంటుంటాము. శిష్య ప్రశిష్యులు అనే పదాలకు అర్థాన్ని రూఢీ చేసుకుందామని శబ్దరత్నాకరాన్ని ఆశ్రయించా. ఇక చూస్కోండి.. అక్కడ మొదలై.. ఎక్కడెక్కడికి వెళ్లి ఆగిందో..!

ప్రశిష్యుడంటే..?
ప్రశిష్యుడు అన్న పదమే శబ్దరత్నాకరంలో లేదు. సరే శిష్యుడు పదాన్ని వెతికా!

శిక్షింపబడే వాడే శిష్యుడట
శిష్యుడు అంటే విద్య కొరకు దగ్గర చేరి సేవచేయుచూ శిక్షింపబడు వాడు అని అర్థం ఉంది.
ఈ శిక్షింపబడడం ఏంటి..? పాపం శిష్యుడు చేసిన నేరం ఏంటి..? సరే..శిక్షింపబడువాడు అంటే..?
శిక్ష అన్న పదానికి అర్థాన్ని శోధించా.
శిక్ష అంటే షడంగములలో ఒకటి లేదా విద్యాభ్యాసం అని శబ్దరత్నాకరం వివరించింది. పనిలో పనిగా
శిక్షితుడు అంటే శిక్షింపబడిన వాడు లేదా నేర్పరి అని,
శిక్షించు అంటే శిక్ష (విద్యాభ్యాసం) చేయు అనీ అర్థాలనిచ్చింది.

షడంగాలా..? అవేంటో..?
శిక్ష అంటే షడంగాలలో ఒకటి అని ఓ అర్థం తెలిసింది కదా..! మరి ఆ ఆరు అంగాలేంటో..?
షడంగములు : శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జోతిషం, కల్పం
హమ్మయ్య షడంగాలు తెలిశాయి..! మరి శిక్షను ఆరు అంగాలలో ఒకటి అన్నారు కదా..?

అంగమంటే..?
అంగం అంటే అందం, విధం, అవయవం, ఉపాయం, దేహం, అప్రధానం అన్నది నిఘంటు వివరణ.
సరి సరి.. అంగాలు ఆరు విధాలన్నమాట అనుకునేలోపే.. అయ్యయ్యో.. అదేంటి..? ఇంకా ఉన్నాయి ఈ కింద చూడండి అని మరిన్ని అంగాలను ప్రస్తావించింది శబ్దరత్నాకరం.
చతురంగాలు : రథం, గజం, తురగము, పదాతి
అంగపంచకం : ఉపాయం, సహాయం, దేశకాల విభజనం, అపదకు ప్రతిక్రియ, కార్య సిద్ధి
పంచాంగములు : తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం,
సప్తాంగాలు : స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము
అష్టాంగాలు : యమము, నియమము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, మననం, సమాధి

ఓర్నాయనో..! ప్రశిష్యుడిని శోధించడం ప్రారంభిస్తే.. అది సమాధి దాకా తీసుకు వెళ్లింది. ఇంకా ముందుకు వెళితే మరెక్కడికి తీసుకెళుతుందో..!! ఏదైతేనేం.. ప్రశిష్యుడంటే.. శిష్యుడికి శిష్యుడు అన్న అర్థాన్ని రూఢీ చేసుకుని.. ఈ పద శోధనను ఆపేస్తున్నా. ఇక్కడ ప్రస్తావించిన పదాల అర్థ వివరాల సంగతి.. భవిష్యత్తులో సందర్భాన్ని బట్టి చూద్దాం. అంతవరకూ ఉంటానే..!

Tuesday, October 19, 2010

ఈనాడులో... "ఐదు వాక్యాల" వార్తలో ఐదు తప్పులు..!

జర్నలిస్టు మిత్రులు ఇటీవల రాస్తున్న వార్తలు పరిశీలిస్తే.. ముఖ్యమైన ప్రాంతాల గురించిన కనీస అవగాహన ఉండడం లేదన్న విషయం అర్థమవుతుంది. జర్నలిస్టులు అన్ని ప్రాంతాలనూ సందర్శించి ఉంటారనుకోవడం అవివేకమే. అయితే.. ఉన్నచోటు నుంచే వివిధ ప్రాంతాల పేర్లు (సరైన రూపం), అక్కడి సంప్రదాయాలు తెలుసుకుని ఉండాలి. దీంతోపాటే.. ఇటీవల మార్పులు జరిగిన ప్రధాన నగరాల పేర్లనూ గమనంలోకి తీసుకోవాలి. లేకుంటే.. ప్రసారం లేదా ప్రచురణ తర్వాత.. ఆ వార్తను చూసిన వాళ్లు, రాసిన వాళ్ల అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటారు. తద్వారా, పత్రిక లేదా ఛానెల్‌ పరువు కూడా పోతుంది.

ఉదాహరణకు, ఈరోజు (19-10-2010) ఈనాడు దినపత్రిక మెయిన్‌ ఎడిషన్‌ మూడో పేజీలో ఓ సింగిల్‌ కాలమ్‌ వార్త వచ్చింది. ఇందులో ఐదంటే ఐదే వాక్యాలున్నాయి. అందులో అయ్యప్ప భక్తులకు సంబంధించిన సమాచారం ఉంది. ఆ వార్త చదివిన అయ్యప్ప భక్తులు కచ్చితంగా ఇది అవగాహన లేని వారు రాసిన వార్త అని తేలిగ్గా అర్థం చేసుకుంటారు.


పై వార్తలో...

మేల్‌శాంతి కి బదులుగా మేలశాంతి అని
ట్రావెన్‌కోర్‌ దేవస్వం బదులుగా త్రవాన్కోర్ దేవశ్వం అనీ రాశారు.
అలాగే, మాలికాపురం బదులుగా మలికప్పురం అని రాశారు.
మేలశాంతిగా పిలిచే ఈ స్థానం కోసం అని రాశారు. మేల్‌శాంతి అంటే ప్రధాన అర్చకుడు అని అర్థం. అది పదవి.. స్థానం కాదు.
మరో వాక్యంలో... "వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు" అని రాశారు.. ఇక్కడ నిర్వహణకు సంబంధించిన అంశం ఎందుకొచ్చిందో అర్థం కాదు. పైగా ఎవరు ఏమి నిర్వహిస్తున్నారో మరి రాసినవారికే తెలియాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థాయిలో ప్రసిద్ధి చెందిన ట్రావెన్‌కోర్‌ దేవస్వం (దేవస్థానం) బోర్డును తప్పుగా రాయడం, శబరిమల ప్రధాన అర్చకుల నియామకానికి సంబంధించిన విధి విధానాలు, ఎంపిక తీరు తెలియక పోవడం, వల్ల ఈ తప్పు దొర్లిందన్నది అర్థమై పోతోంది. కేవలం ఐదు వాక్యాల వార్తలో.. ప్రతి వాక్యంలోనూ ఇన్ని తప్పులు రావడానికి, రాసినవారి అవగాహన లోపమే కారణమన్నది నా భావన. అయితే ఇంఛార్జి గారూ దీన్ని చూసీ చూడనట్లు వదిలేయడం సమంజసమనిపించడం లేదు.

ముంబైని బొంబాయిగాను, చెన్నైని మద్రాసుగాను, గౌహతిని గువాహటిగాను నేటికీ రాస్తున్న ప్రముఖులు ఉన్నారు. సీనియర్లు కాస్త జోక్యం చేసుకుని ఇట్లాంటి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ పోతే... యంగ్‌ టాలెంట్స్‌ నేర్చుకుంటూ వస్తారు. ఏమంటారూ..?