Thursday, September 30, 2010

మిత్రులారా సంయమనం పాటిద్దాం

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై, అలహాబాద్‌ లక్నో బెంచ్ ఇవాళ‌ తీర్పు ఇవ్వబోతోంది.

దేశమంతా తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్నాయి.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని పదిగంటలకంతా ఇళ్లకు పంపేయాలని పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆమేరకు సిద్ధపడి బడికి రావాలని నిన్ననే పిల్లలకు చెప్పేశాయి. దాదాపు అన్ని విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు మతాల పెద్దలను శాంతి సామరస్యతలకు కట్టుబడి ఉంటామని ఒప్పించారు! ఈనెల 24వ తేదీనే ఈ తీర్పు వెలువడుతుందని భావించిన అధికారులు, 21వ తేదీనుంచే ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే తీర్పు వాయిదా కోరుతూ.. సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడం.. దానిపై విచారించిన సుప్రీం పిటిషన్‌ను తోసిపుచ్చడం వల్ల.. తీర్పు వెలువడడంలో కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో అధికారులు, నిన్న మళ్లీ హడావుడిగా అందరినీ సమావేశపరిచి, సుహృద్భావతను పెంపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రోశయ్య, డిజిపి అరవిందరావు‌ ఒకరేమిటి అందరూ అన్ని సందర్భాల్లోనూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అయోధ్య వివాదంపై తీర్పు నేపథ్యంలో, ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు కొనసాగించాలనుకున్న తూర్పుగోదావరి జిల్లా పర్యటననూ రద్దు చేసుకుని, అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యూరోక్రాట్లు, మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఇందరు చేస్తున్న విన్నపాన్ని జర్నలిస్టులుగా మనందరం మన్నిద్దాం. పెడధోరణులను విడిచి పెడదాం. ప్రతిరోజూ కన్నా మిన్నగా.. ప్రజాహితమే పరమావధిగా ఇవాళ మరింత బాధ్యతాయుతంగా పనిచేద్దాం. ఆవేశం అన్ని వేళలా అనర్థదాయకం. తెచ్చిపెట్టుకున్న, ప్రేరేపిత ఆవేశాలను పూడ్చిపెట్టేద్దాం. సహజసిద్ధమైన మన సౌభ్రాతృత్వాన్ని పరిమళింప చేద్దాం.

పుకార్లను విస్మరిద్దాం. సంయమనం పాటిద్దాం. శాంతిని కాపాడదాం.

No comments:

Post a Comment