Sunday, January 23, 2011

జగన్‌ ఓటమా..? నరసింహన్‌కి రాజదండమా..?

ముసుగులు గబగబా తొలగిపోతున్నాయి. ఒరలలో నుంచి బరబరా బయటికి దూసిన కత్తులు తళతళా మెరుస్తున్నాయి. కుత్తుకలు కత్తిరించడానికి సిద్ధం అవుతున్నాయి. వాతావరణం అమాంతంగా వెడెక్కిపోతున్నది. యుద్ధానికి ఉభయ పక్షాలూ సై అంటున్నాయి. రాబోయే కాలంలో రాజకీయ పోరాటం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికీ మధ్యనే ప్రధానంగా. మూడో పక్షం కొంత తగ్గవలసి వస్తుంది. తెలుగు దేశం అధినేత చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు చాలా ఆలోచిస్తున్నారు. ఉద్యమంలో కాస్తంత విలంబన పాటించవలసి రావచ్చు. రాష్ట్రంలో రసవత్తరంగా జరగబోయే కోడిపందెం ఫలితం తేలిన తర్వాత కొన్ని ప్రశ్నలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుచూపు మేరలో కనిపిస్తాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తవుల ధరలూ, రైతుల కష్టనష్టాలూ వంటి సమస్యలకు పరిష్కారం గురించి ఆలోచించే వ్యవధి ఏలినవారికి ఉండదు.

సంక్రాంతికి బాగా ముందుగానే కాంగ్రెస్ అధిష్ఠానం కోడి పందాలకు రంగం సిద్ధం చేసింది. పౌరుషం అధికంగా ఉన్న జగన్ అనే పోరు కోడి అదేపనిగా కాలుదువ్వడాన్నీ, ధిక్కారపు కూతలు కూయడాన్నీ సహించలేకపోయిన అధిష్ఠాన దేవత పోటీ కోడిని దగ్గరికి తీసుకొని దువ్వి, పోరు పాఠాలు చెప్పి మరీ రంగంలోకి దించింది. అదే ప్రాంతానికీ, అదే జాతికీ చెందిన దాదాపు అదే వయస్సు కోడిని గుర్తించి పోటీకి నిలిపినందుకు అధిష్ఠానం తనను తాను అభినందించుకున్నది. కడప కోడి ఆట కట్టిస్తానంటూ పీలేరుకు చెందిన కొత్త కోడి ఇచ్చిన హామీని ఢిల్లీ రాజకీయ జూదరులు విశ్వసించారు. జగన్ బెడద త్వరలోనే తొలగిపోతుందని అధిష్ఠానం తలపోసింది. కానీ కొత్త కోడి బరిలోకి దిగడానికి మీనమేషాలు లెక్కించింది. ముక్కుకూ, కాళ్ళకూ కత్తులు కట్టుకొని పోరాటం ప్రారంభించేందుకు అవసరానికి మించిన సమయం తీసుకుంది. ఇంతలో అధిష్ఠాన దేవతకు అనుమానం వచ్చింది. సర్కారు కోడికి పౌరుషం ఉన్నదా లేదా అన్న ప్రశ్న ఉదయించింది. గుండెబలం లేదేమోనన్న సందేహం కలిగింది. హస్తినకు పిలిపించింది. రెండు మాసాల కిందట ఇచ్చిన హామీని గుర్తు చేసింది. కర్తవ్యాన్ని తిరిగి ప్రబోధించింది. ధైర్యం నూరిపోసింది. పోరు వెంటనే ప్రారంభించాలనీ, చావో రేవో తేల్చుకోవాలనీ కరాఖండిగా చెప్పింది. కడప కోడి శృంగనాదం చేసిన హస్తినలోనే సర్కార్ కోడి కూడా శంఖం పూరించాలని పట్టుపట్టింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపైన ధ్వజమెత్తారు. మొట్టమొదటి సారిగా ప్రత్యక్షంగా మాటల తూటాలు పేల్చారు. జగన్ వెంట తిరుగుతున్న కాంగ్రెస్ శాసనసభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలంటూ హితవు చెప్పారు. ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టు జగన్ అనుయాయులు తక్షణమే తిరుగుదాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరుకే చెందిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు కుతూహలమ్మ మరోసారి కదన కుతూహలం ప్రదర్శించారు. మంత్రిపదవి రాలేదని కోపగించిన కుతూహలమ్మ కిరణ్ కుమార్ రెడ్డికి అటువంటి వ్యాఖ్య చేసే అర్హతే లేదంటూ విమర్శించారు. మంత్రి పదవి పోయిందని కృద్ధుడైన కురువృద్ధుడు గాదె వెంకటరెడ్డి ముఖ్యమంత్రి తొందరపడ్డారంటూ తప్పుపట్టారు. జగన్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జగన్ ను అనుసరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటూ అంబటి రాంబాంబు వంటి జగన్ వర్గీయులు బదులిచ్చారు. వేడిలో వేడిగా వైఎస్ కుటుంబానికి కోట వంటి పులివెందులలో రచ్చబండ కార్యక్రమం జరిపించేందుకు ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శత్రు దుర్గాన్ని ముట్టడించడానికి ముఖ్యమంత్రి సాహసిస్తున్నారని అనుకోవాలి. మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారని భావించాలి.
నిధులు లేక బొక్కసం నిండుకున్నప్పటికీ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్న ముఖ్యమంత్రి తాపత్రయం ప్రజలకు ఏదో ఒక విధంగా దగ్గర కావాలనే. వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా సంక్షేమ పథకాల దన్నుతో ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకోవాలన్నది కిరణ్ దీర్ఘ కాలిక వ్యూహం కావచ్చు. కానీ రచ్చబండ ప్రారంభం కావడానికి ముందే జగన్మోహన్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవాలని అధిష్ఠానం ఒత్తిడి తేవడంతో కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధప్రణాళికలో స్వల్పంగా సవరణలు చేసుకోవలసి వస్తున్నది. జగన్ ఆట కట్టిస్తానంటూ అధిష్ఠానవర్గానికి వాగ్దానం చేసి... ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్ ప్రమాణస్వీకారం తర్వాత ఒకసారి ఫోన్ చేసి జగన్ ను పలకరించడం మినహా యువనాయకుడితో సయోధ్యకోసం ప్రత్యేకించి ప్రయత్నించిన దాఖలా లేదు. జగన్ ను బలహీనపరచడానికి తీసుకున్న అరకొర చర్యలు సైతం సత్ఫలితాలు ఇవ్వలేదు. విజయవాడ దీక్షకు కానీ, ఢిల్లీ ప్రదర్శనకు కానీ, విశాఖపట్టణం నిరశన వ్రతానికి కానీ హాజరు కారాదంటూ కిరణ్ చెప్పిన హితవును దాదాపు పాతిక మంది కాంగ్రెస్ శాసనసభ్యులూ పెడచెవిన పెట్టారు. జగన్ ను అనుసరిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరగకుండా చూసుకుంటూ మిగిలినవారిని పిలిపించి మాట్లాడుతున్నారు. నరుడా ఏమి నీ కోరిక అన్న పద్ధతిలో అడుగుతున్నారు. ఒకవైపు శాసనసభ్యలను బుజ్జగించి మంచి చేసుకుంటూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజలలోకి వెళ్ళాలనీ, ప్రజామోదం పొందాలనీ కిరణ్ కుమార్ రెడ్డి తలపోశారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడవద్దంటూ, జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవద్దంటూ శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి సలహా చెబుతున్నట్టు అధిష్ఠానవర్గానికి సమాచారం అందింది. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వంటి రాజీవ్ కుటుంబ విధేయులూ, అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులూ లేఖల ద్వారానూ, మౌఖికంగానూ అందించిన సమాచారం అధిష్ఠానదేవతకు ఆగ్రహం కలిగించింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యనాయకులు సోనియా సమక్షంలో రెండు గంటల పాటు రాష్ట్ర వ్యవహారాలపైన సమాలోచన జరిపినట్టు వార్త వచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైనా, రాష్ట్ర భవిష్యత్తుపైనా సుదీర్ఘ చర్చలు జరిగి ఉంటాయని అందరూ భావించారు. అనంతర పరిణామాలను గమనిస్తే కోర్ కమిటీ చర్చ ప్రధానంగా జగన్ తిరుగుబాటును ఎట్లా అణచివేయాలన్న అంశంపైనే జరిగినట్టు కనిపిస్తోంది.

తుదకంటా పోరాడాలన్నదే అధిష్ఠానం నిర్ణయం. జగన్ అనుయాయులపైన చర్య తీసుకోవడమే అభిమతం. చేతనైతే ప్రభుత్వాన్ని పడగొట్టమంటూ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జగన్ ను సవాలు చేయడం సైతం ఆయన స్వయంగా చేసిన పని కాకపోవచ్చు. అధిష్ఠానం ప్రణాళికలో భాగమే కావచ్చు. జగన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని చీల్చితే ప్రజారాజ్యం సభ్యలను ప్రభుత్వంలో చేర్చుకోవాలన్నది నిర్ణయం. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అటువంటి శుభసంకేతం కోసం శతసహస్ర నయనాలతో ఎదురు చూస్తున్నారన్నది ప్రజాభిప్రాయం. అప్పటికీ చాలకపోతే మజ్లీస్ మిత్రులు జో హుకుం అంటూ ఉండనే ఉన్నారు. జగన్ పట్ల శాసనసభ్యుల విధేయత ఊహించనంతగా పెరిగితే, ప్రజారాజ్యం, ఎంఐఎం మద్దతు సైతం పరిపోక ప్రభుత్వం పడిపోయే పరిస్థితే వస్తే రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించడానికి గవర్నర్ నరసింహన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల ప్రథమార్థంలోనే ఆయన రెండు సార్లు హస్తిన వెళ్ళివచ్చారు. నిరుడు అనేక పర్యాయాలు ఢిల్లీ పోయివచ్చారు. సోనియాను సందర్శించారు. నిజానికి ఆయన రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణం చేసినప్పటి నుంచే పరిపాలనా బాధ్యతలకోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖాయం కావడంలో నరసింహన్ పాత్ర సైతం ఎంతో కొంత ఉంది. జగన్ వ్యవహారాన్ని రోశయ్య లాగా నాన్చకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న అధిష్ఠానం సంకల్పానికి అనుగుణంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. జగన్ పరాజయమో, నరసింహన్ కు రాజదండం అప్పగించడమో తేలిపోవాలన్నది ఢిల్లీ పెద్దల పట్టుదలగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తిగా మద్దతు ఇవ్వడం, జగన్ ను పూర్వపక్షం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమైతే, ప్రభుత్వ నిర్వహణ సజావుగా సాగకపోతే రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను సుప్తావస్థలో ఉంచడం కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం. తెలంగాణ ఉద్యమం, జగన్ రాజకీయం అనే రెండు బెడదలకూ ఇది తాత్కాలిక పరిష్కారం అవుతుందనీ, పరిస్థితులు కుదురుకున్న తర్వాత రెండు సమస్యల శాశ్వత పరిష్కారంకోసం తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవచ్చుననీ భావన.
(hmtv చీఫ్‌ ఎడిటర్‌ శ్రీ రామచంద్రమూర్తి గారు.. hmtv సంపాదకీయం 'హంసధ్వని' కోసం ఈ వ్యాసాన్ని 23-01-2011న రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకునే వారు www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి.)

Thursday, January 13, 2011

బోఫోర్స్ : మన్మోహన్‌ వ్యక్తిత్వంపై మరో మరక


బోఫోర్స్ భూతం మరోసారి నిద్రలేచి వికటాట్టహాసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నిద్రకు దూరం చేస్తోంది. అధినాయకురాలి ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ముంచుకొస్తోంది. మచ్చలేని నీతిమంతుడుగా ఇంతకాలం పేరు నిలబెట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంపైన మరో మరక పడుతోంది. స్వయంగా అవినీతికి ఒడిగట్టకపోయినప్పటికీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న ప్రధానిగా మన్మోహన్ ను చరిత్ర బోను ఎక్కించనున్నది. దేశంలో అత్యున్నత పరిశోధన సంస్థ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పాలకుల చేతిలో ఆయుధమని ఇంకోసారి నిరూపించుకున్నది. నేరపరిశోధన చేయకుండా, అధికార పార్టీ లేదా అధికార కూటమి ప్రత్యర్థులను వేధించడానికీ, అస్మదీయులను రక్షించడానికీ అక్రమంగా పనిచేస్తున్న జేబు సంస్థగా తాజా ముద్ర వేయించుకున్నది.
సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఇటాలియన్ వ్యాపారి అట్టావియో కత్రోకీకి బోఫోర్స్ ముడుపులు ముట్టినట్టు ఇన్ కంటాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఈ నెల 3వ తేదీన ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. కత్రోకీకీ, సోనియా కుటుంబానికీ సంబంధాలు లేవంటూ బుకాయించడానికి దిగ్విజయ్ సింగ్, వీరప్పమొయిలీ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆడుతున్న నాటకాన్నే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడూ ప్రదర్శిస్తున్నది. ఐటీఏటీలో నిజాయితీపరులు లేకపోతే కత్రోకీ నిర్దోషిగా బయటపడేవాడు. బోఫోర్స్ కుంభకోణం కారణంగానే 1989లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ కారణంగానే విశ్వనాథ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రధాని కాగలిగారు. వీపీ సింగ్ కానీ ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర్ కానీ, పీవీ నరసింహారావు కానీ, దేవెగౌడ, గుజ్రాల్ కానీ, అటల్ బిహారీ వాజపేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ బోఫోర్స్ గుట్టు రట్టు చేయలేకపోయారు. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న విన్ చఢాను దోషిగా నిర్ధారించడాన్ని ప్రభుత్వాలు అనుమతించాయి కానీ కత్రోకీకి మాత్రం రాచమర్యాదలు చేశాయి. అతగాడిమీద ఈగ కూడా వాలకుండా సీబీఐని కట్టడి చేశాయి. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలియకుండా మాయ చేశాయి. బోఫోర్స్ కేసులో కీలకమైన పరిశోధన చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయంలో విసిగి వేసారిపోయాడు. ‘సీబీఐ స్వతంత్ర సంస్థ అని ఎవరు చెప్పారు? అది ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థ అప్పీలు పిటిషన్ సైతం దాఖలు చేయజాలదు. బోఫోర్స్ కేసులో అదే జరిగింది. మూడు సందర్భాలలో కోర్టు ఆదేశాన్ని సవాలు చేయడానికి ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేయలేదు. ఈ కేసును పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారు’ అంటూ ఇటీవల ఒక ఇంటర్వూలో ఆవేదన వెలిబుచ్చాడు జోగీందర్ సింగ్. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు తీసుకురావడానికి జోగీందర్ స్వయంగా స్విట్జర్లాండ్ లోని బెర్న్ వెళ్ళివచ్చాడు. కత్రోకీకి ముడుపులు ముట్టాయని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆయన వాదిస్తున్నాడు. రాజీవ్ ప్రధానిగా ఉండగా కత్రోకీ, ఆయన భార్య మారియా ప్రధాని అధికార నివాసానికి తరచుగా వచ్చేవారనీ, రాజీవ్ మరణం తర్వాత కూడా కత్రోకీ సోనియాగాంధీని ఇరవై ఒక్క సార్లు కలుసుకున్నాడనీ సీబీఐ నమోదు చేసిన వాగ్మూలంలో కత్రోకీ డ్రైవర్ శశి ధరణ్, సోనియా అంగరక్షకుడు నరేష్ చంద్ర గోసాయిన్ వెల్లడించారు. బోఫోర్స్ కేసు విచారణ జరుగుతున్న కాలంలోనూ కత్రోకీ కుటుంబం సోనియా కుటుంబం మధ్య రాకపోకలు సాగాయి. సోనియా తల్లి సావొలా మెయినోతోనూ, సోదరి మరౌచ్కాతోనూ కత్రోకీకి సన్నిహిత సంబంధాలు ఉండేవని కూడా సీబీఐ దర్యాప్తులో తేలింది. సమస్త సమాచారం ఉన్నప్పటికీ కత్రోకీని నిలదీయకుండా దేశం నుంచి వెళ్ళిపోవడానికీ, లండన్ బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికీ అవకాశం కల్పించింది సీబీఐ. కత్రోకీపైన కేసు మూసివేయడానికి సన్నాహాలు జరుగుతుండగా బోఫోర్స్ భూతం వెకిలిగా నవ్వింది. ఇటాలియన్ మధ్యదళారీ కత్రోకీ 41కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయంటూ ఐటీఏటీ 22 సంవత్సరాల విచారణ తర్వాత మొన్న జనవరి 4న నిర్థారించింది. ఈ ముడుపులలో కొంత భాగాన్ని పనామాలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టు కూడా ఆదాయం పన్ను వ్యవహారాల ఉన్నత సంస్థ స్పష్టం చేసింది. ఈ బ్యాంకు ఖాతా సోనియాగాంధీ కుటుంబ సభ్యులదంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తున్నది. ఈ ఆరోపణ న్యాయస్థానాలలో రుజువు కాకపోవచ్చు. సోనియాను కానీ ఆమె తోబుట్టువులను కానీ దోషులుగా నిర్ధారించలేకపోవచ్చు. కానీ చెరిగిపోయిందనుకున్న బోఫోర్స్ మచ్చ మళ్ళీ అకస్మాత్తుగా బయటపడి వికృతంగా కనిపిస్తోంది. నెహ్రూ-గాంధీ వంశంలో నాలుగో ప్రధానిగా రాహుల్ ను గద్దెనెక్కించడమే పరమావధిగా జీవిస్తున్న సోనియాపైనే ఆరోపణల మేఘాలు కమ్ముకుంటే, ప్రజల హృదయాలలో ఆమెపైన గౌరవం తగ్గిపోతే కాంగ్రెస్ కు తిరిగి రెండు వందల పైచిలుకు లోక్ సభ సీట్లు దక్కడం, యూపీఏ కూటమి మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దానికి రాహుల్ నాయకత్వం వహించడం సాధ్యమా? కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, టూజీ స్పెక్ట్రమ్ మహాకుంభకోణం చాలవన్నట్టు బోఫోర్స్ భూతం అమాంతంగా కాంగ్రెస్ అధిష్ఠానం నెత్తినెక్కి నాట్యం చేస్తోంది. సోనియాకూ, రాహుల్ కూ, వారిద్దరిపైనే ఆధారపడిన కాంగ్రెస్ కూ కష్టకాలం దాపురించిందనుకోవాలి.
ఇక నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఇంతకాలం ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మన్మోహన్ పరిస్థితి మరీ దయనీయం. కత్రోకీపైన కేసును నీరు కార్చే ప్రక్రియను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పర్యవేక్షించడం వల్ల ఆయన ఈ వ్యవహారంలో తప్పుకోవడానికి అవకాశం లేదు. సాక్ష్యాధారాలు లేని కారణంగా కత్రోకీ ప్రాసిక్యూషన్ ను విరమించుకుంటున్నట్టు 2009 సెప్టెంబరులో మన్మోహన్ సింగ్ సర్కార్ సుప్రీంకోర్టుకు చెప్పింది. వాజపేయి ప్రధానిగా ఉండగా 2003లో ప్రభుత్వం ఒత్తిడి కారణంగా లండన్ లో కత్రోకీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. 2006లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా ఆంక్షలు ఎత్తివేసి లండన్ బ్యాంక్ ఖాతాకు తిరిగి ప్రాణం పోసింది. ఆ ఖాతా నుంచి కత్రోకీ 21కోట్ల రూపాయలు తీసుకోవడానికి వీలు కల్పించింది. కత్రోకీపైన రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించుకోవలసిందిగా సీబీఐకి 2008 అక్టొబర్ లో నాటి అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ సలహా ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం లేకుండా జరిగేవి కావు. పనామా బ్యాంకు ఖాతా ఎవరిదో సీబీఐకి తెలుసు. ప్రధానికి తెలుసు. కానీ కోర్టులకు తెలియదు. ప్రజలకు తెలియదు. కత్రోకీకి ముడుపులు చెల్లించిన మాట నిజమంటూ ట్రిబ్యూనల్ ప్రకటించిన తర్వాత కత్రోకీని రక్షించడానికీ, దేశం నుంచి సురక్షితంగా సాగనంపడానికీ, అతడు ముడుపుల సొమ్మును బ్యాంకు నుంచి తీసుకోవడానికీ, అతనిపైన కేసు ఎత్తివేయడానికీ సహకరించిన ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కాకుండా ఉంటుందా? ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్ సింగ్, ఆయనను నడుపుతున్న సోనియాగాంధీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందా?
ఉన్నత స్థాయిలో ఉన్న ఇద్దరు నేతలతో పాటు ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ సైతం అప్రతిష్ఠపాలు కావడం విశేషం. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీని రక్షించడానికీ, పనామా బ్యాంకు ఖాతాదారుల వివరాలు గోప్యం ఉంచడానికీ ప్రయత్నించి విశ్వసనీయతను కోల్పోయిన సీబీఐ మరికొన్ని కేసులలో కూడా ప్రభుత్వానికీ, పాలకవర్గానికీ లొంగి దర్యాప్తు చేయకుండా వాస్తవాలను సమాధి చేసింది. ఆరుషి, హేమరాజ్ హత్య కేసు, రుచిక గిర్హోత్రా ఆత్మహత్య కేసు, 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ పాత్రను నిర్ధారించే కేసు వంటి కేసులలోనూ సీబీఐ పాత్ర శోభాయమానంగా లేదు. జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది. ఆరుషి హత్య కేసులో హంతకులను పట్టుకోకపోగా దంతవైద్యుడు తల్వార్ కుటుంబాన్ని అనవసరంగా బజారుకు ఈడ్చి సీబీఐ అదనంగా అపకీర్తి మూటకట్టుకుంది. బహుజన సమాజ్ నేత మాయావతినీ, సమాజ్ వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ నీ, జనతాదళ్ నాయకుడు లాలూప్రసాద్ నీ బెదిరించి లొంగదీసుకోవడానికి సీబీఐని ఒక సాధనంగా యూపీఏ నాయకత్వం వినియోగించుకుంటున్నది. యూపీఏకి విధేయంగా ఉన్నంత కాలం మాయావతిపైన కేసులు కానీ ములాయంపైన కేసులు కానీ లాలూపైన కేసులు కానీ ముందుకు సాగవు. యూపీఏ తో విభేదించి ప్రతిపక్ష శిబిరంలో చేరిన వెంటనే వారిపై కేసులు మళ్ళీ మొదలవుతాయి. ఈ బాగోతాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులు, రచయితలు సైతం సీబీఐ నిర్వాకంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సీబీఐని భ్రష్టుపట్టించిన ఘనత కూడా యూపీఏ సర్కార్ కే దక్కుతుంది.
అవినీతిని అరికట్టవలసిన యూపీఏ అధ్యక్షురాలు, ప్రధాని, సీబీఐ అవినీతితో రాజీపడితే ఈ దేశానికి నిష్కృతి ఉంటుందా? అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ‍యూపీఏ సర్కార్ ను సరైన మార్గంలో నడిపించగలుగుతుందా? టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని-జేపీసీని- నియమంచడానికి అంగీకరించకపోతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా? ఈ పరిస్థితులు మధ్యంతర ఎన్నికలకు దారి తీస్తాయా? మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ రాదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. యూపీఏ సర్కార్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలనే అస్త్రాలుగా చేసుకొని ప్రచార యుద్ధం సాగించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఇటీవల గువాహతి సమావేశంలో నిర్ణయించింది. ఏ కోణం నుంచి చూసినా కాంగ్రెస్ కు పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. బోఫోర్స్ భూతం మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించనున్నదా? రాజీవ్ గాంధీని గద్దె దింపిన బోఫోర్స్ భూతం ఆయన కుమారుడు రాహుల్ 2014లో అనుకున్న ప్రకారం గద్దెనెక్కకుండా అడ్డుపడుతుందా?

Sunday, January 9, 2011

శ్రీకృష్ణ కమిటీ నెరవేర్చిన ప్రయోజనం ఏంటి..?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడయింది. యథాతధస్థితిని కొనసాగించడం ఇకమీదట సాధ్యం కాదని నివేదిక ప్రారంభంలోనే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆరు సూచనలను చేసింది. ఆరు ప్రత్యామ్నాయాలనూ వివరించింది. ప్రతి సూచనపైనా తన వ్యాఖ్యలు చేసింది. ఆరు ప్రతిపాదనలు చేసినప్పటికీ మొదటి మూడు ప్రతిపాదనలనూ అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. చివరి మూడు ప్రతిపాదనలనే పరిశీలించాలన్నది కమిటీ అభిమతం. అందులోనూ హైదరాబాద్ చుట్టూ నాలుగు జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించాలన్న సరికొత్త సూచనను తెలంగాణవాదులు గట్టిగా ప్రతిఘటిస్తారని కమిటీనే చెప్పింది. మిగిలినవి అయిదో సిఫార్సు, ఆరో సిఫార్సు. ఆరో సిఫార్సుకు కమిటీ అగ్రతర ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ సామాజికార్థికాభివృద్ధికి అవసరమైన హామీలను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనీ, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలన్నది శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను అసాధ్యమని భావిస్తే, రాష్ట్ర విభజన అనివార్యమైతేనే అయిదో ప్రతిపాదన పరిశీలించాలని కూడా కమిటీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సహితంగా ఏర్పాటు చేయాలనీ, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించాలన్నది అయిదో సిఫార్సు. ఈ ప్రతిపాదనకు మూడు ప్రాంతాల ప్రజలనూ ఒప్పించాలని మెలిక పెట్టింది. మూడు ప్రాంతాల ప్రజలూ రాష్ట్ర విభజనకు అంగీకరించడం జరగని పని. కమిటీ చేసిన ఆరు సూచనలతో పాటు సుదీర్ఘమైన నివేదికలో అనేక వ్యాఖ్యలు చేసింది. నిశితంగా పరిశీలిస్తే చాలా వ్యాఖ్యల పట్ల అన్ని ప్రాంతాలవారికీ అభ్యంతరాలు ఉంటాయి.
ఏ ప్రాంతం ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో తెలుసుకొని నివేదిక రాయడానికి మాజీ న్యాయమూర్తులూ, మాజీ ఐఏఎస్ అధికారులూ, అధ్యాపక ప్రముఖులూ అక్కరలేదు. ఢిల్లీ నుంచి పనికట్టుకొని రానక్కరలేదు. హెచ్ఎంటీవీ హైదరాబాద్ లోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏడు మాసాలపాటు నిర్విరామంగా నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ’ కార్యక్రమాలను ఢిల్లీలో కూర్చొని వీక్షించి ఉంటే ఇంతకంటే మెరుగైన నివేదిక ఇవ్వగలిగేవారు. ‘దశ-దిశ’ కార్యక్రమాలలో సుమారు పదివేల మంది పాల్గొన్నారు. పదిహేను వందల మంది తమ అభిప్రాయాలను స్వయంగా వ్యక్తం చేసి రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ లక్షలాదిమంది హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినిపించారు. ఇంతమందిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సంవత్సరం కాలంలో కలిసి ఉండరు. ఇన్ని అభిప్రాయాలు సేకరించి ఉండరు. పైగా ‘దశ-దిశ’ కార్యక్రమాల డీవీడీలను కమిటీ కార్యదర్శి దుగ్గల్ మహాశయుడికి సమర్పించాం. ‘దశ-దిశ’ కార్యక్రమం తమ పనిని సులువు చేసిందని కూడా ఆయన ఢిల్లీ మీడియా సమావేశంలో అభినందించారు. ఏ ప్రాంతం ప్రజలలో అధిక సంఖ్యాకులు ఏమి అనుకుంటున్నారో తెలియజేయడమే శ్రీకృష్ణ కమిటీ లక్ష్యం అయినట్లయితే ఇంత హడావుడి, ఇంత ప్రచారం, ఇంత ఉత్కంఠ అనవసరం. వాస్తవానికి ఇటువంటి కమిటీలకు ఉన్న పరిమితులు తెలియక ప్రజలు శ్రీకృష్ణ కమిటీ నుంచి ఎక్కువ ఆశించి ఉంటారు. ఒకే ఒక సిఫార్సు చేయాలని కోరుకొని ఉంటారు. ఇది కమిషన్ కాదు. కేవలం కమిటీ. హోంశాఖ నియమించిన సంఘం. ఇటువంటి కమిటీ ఏదైనా ఏదో ఒక్క సిఫార్సు చేయలేదు. ఒకటికి మించి సిఫార్సులను చేసి వాటిలో ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించే సావకాశం ప్రభుత్వాలకు కల్పించడం ఆనవాయితీ. అదే పద్ధతిలో శ్రీకృష్ణ కమిటీ వ్యవహరించింది. కమిటీ చేసినవీ, చేయగలిగినవీ సూచనలే కానీ నిర్ణయాలు కాదని అందరూ అర్థం చేసుకోవాలి.
‘దశ-దిశ’ కార్యక్రమాలలో ప్రస్తావనకు వచ్చి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులలో ప్రస్తావనకు రాని అంశాలు రెండు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కొందరు సీమవాసులు చేసిన వాదనను కమిటీ పరిగణించినట్టు లేదు. ఉత్తరాంధ్రలో కూడా కొందరు ప్రత్యేక కళింగాంధ్రను ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ఈ రెండు వాదనలనూ వినిపించినవారి సంఖ్య గణనీయమైనది కాదు కనుక కమిటీ పట్టించుకోకుండా వదిలిపెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చును. కానీ ఎక్కడా వినిపించని కొత్త వాదాన్ని ప్రజల ముందుకు తేవడాన్ని అర్థం చేసుకోవడం కష్టం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను కలిపి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నది కమిటీ సృష్టించిన సంచలనాత్మకమైన కొత్త ప్రతిపాదన. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధానిగానో చేయాలని చాలామంది ‘దశ-దిశ’ కార్యక్రమాలలో కోరారు. కానీ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలలనూ హైదరాబాద్ లో కలిపి విస్తారమైన కేంద్ర పాలిక ప్రాంతంగా ప్రకటించాలని ఎవ్వరూ కలలోనైనా కోరలేదు. ఇది కమిటీ సభ్యుల బుర్రల్లో పుట్టిన ఆలోచన అనుకోవాలి. యాభై నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న వాదోపవాదాలు కొత్త పుంతలు తొక్కడానికి అవసరమైన అంశాలను కమిటీ తన నివేదికలో చేర్చడం నిశ్చయంగా ఆక్షేపణీయం. సమస్యను జటిలం చేయడం ధర్మం కాదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా లేక సమైక్య రాష్ట్రంగా కొనసాగాలా అన్నదే ప్రధానంగా చర్చనీయాంశం. ఈ రెండు వాదనలలో ఏ వాదం సమంజసంగా ఉన్నదో, ఏది అత్యధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమో పరిశీలించడం పరమావధి.
ఆరో ప్రతిపాదన ఉత్తమమైనదనీ, అయిదో ప్రతిపాదన రెండో ప్రాధాన్యం ఇవ్వదగినదనీ కమిటీ అంటోంది. అంటే, తెలంగాణ సామాజికార్థిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం, దానికి విశేషాధికారాలు ఇవ్వడం, రాజ్యాంగబద్ధమైన హామీలు ఇవ్వడం ద్వారా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం కమిటి ప్రధమ ప్రాధమ్యం ఇచ్చిన సిఫార్సు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించడం రెండవ ప్రతిపాదన.
ఆరో ప్రతిపాదనకూ, మొదటి ప్రతిపాదనకూ పెద్ద తేడా లేదు. సామాజికార్థిక అభివృద్ధికి మండలాలు ఏర్పాటు చేయడం కొత్త ఆలోచన కూడా కాదు. తెలంగాణ కమిటీకి ఇప్పటికీ ఉప్పనూతల పురుషోత్తమరెడ్డి అధ్యక్షుడే. సీమాంధ్ర, రాయలసీమ కమిటీల అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించడానికి సైతం నిరాకరించారు. లోగడ చొక్కారావు వంటి నాయకుల నేతృత్వంలో ప్రాంతీయ మండళ్ళు పని చేశాయి. అన్ని ఒప్పందాల మాదిరే ఈ మండళ్ళు కూడా సవ్యంగా అమలు జరగలేదు. దీనికి కారణం పాలకులకు న్యాయభావన కొరవడటం. రాజ్యాంగపరమైన హామీలు ఎన్ని ఇచ్చినా పాలకులలో న్యాయభావన లేకపోతే హామీలు అమలుకు నోచుకోవన్నది అనుభవం నేర్పుతున్న పాఠం. ఒప్పందాలు అమలు కాకపోవడమే ప్రస్తుత సమస్యకు కారణమంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదించింది. మళ్ళీ అటువంటి హామీలు ఇచ్చి సమైక్య గీతాలాపన కొనసాగించాలని సూచిస్తోంది. ఇందులో వైరుధ్యం ఉన్నప్పటికీ ఆరో సూత్రాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, నిర్ణయం అమలుకు చాలా గట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాజ్యాంగపరమైన హామీలు ఇచ్చి వాటిని పరిరక్షించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించవలసి ఉంటుంది. షరతులు లేని సమైక్య రాష్ట్రం కావాలని కోరుతున్నవారు తెలంగాణకు ప్రత్యేకమైన హామీలు ఇవ్వడాన్ని హర్షిస్తారో లేదో తెలుసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు లేకపోతే అయిదో సూచనే శరణ్యం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరితో సాకల్యంగా చర్చించాలి. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం వల్ల ప్రయోజనం లేదని తేలిపోయింది. అదే పద్ధతిని కొనసాగించడంలో అర్థం లేదు. వ్యవహారాన్ని తేల్చకుండా నాన్చడానికి మాత్రమే ఈ పద్ధతి పనికి వస్తుంది. పార్టీల అధ్యక్షులను పిలిపించుకొని ప్రధాని, హోంమంత్రి మాట్లాడాలి. అఖిలపక్ష సమావేశాలలో కాదు. నేరుగా ముఖాముఖి మాట్లాడాలి. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాంతాలవారీగా రెండుగా చీలిన మాట కంటికి కనిపిస్తున్న వాస్తవం. ఆ పార్టీల తరఫున పీసీసీ అధ్యక్షుడు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ప్రత్యేక తెలంగాణ అనో సమైక్య రాష్ట్రం అనో ఏదో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి లేదు. పీసీసీ అధ్యక్షుడు ఈ బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షురాలిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా పెడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అధిష్ఠానం ఎట్లా చెబితా అట్లా నడుచుకుంటాం అన్నది వారి మంత్రం. టీడీపీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కేంద్రం ఏ నిర్ణయం చేసినా సరే అది తమ తమది కాదనీ, కేంద్ర ప్రభుత్వానిదనీ కార్యకర్తలకు నచ్చజెప్పే అవకాశం తెలుగుదేశం అధినేతకు కావాలి. రెండు కళ్ళ విధానాన్ని అనుసరిస్తున్న టీడీపీ అధినేత మరోవిధంగా ముందుకు పోవడం సాధ్యం కాదు. రాష్ట్ర రాజకీయ నాయకులే తుది నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో చిదంబరం, ఇటీవల వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు పలాయనవాదానికి సంకేతాలు. సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేయడానికి చూపించే సాకులు. మీనమేషాలు లెక్కపెట్టడానికీ, ఆషామాషీ వ్యాఖ్యలు చేయడానికి ఇది తరుణం కాదు. నిప్పుతో చెలగాటం ఆడటం మంచిది కాదు. పేరామిలటరీ దళాలను రంగంలో దింపి, కేంద్ర ప్రభుత్వం అస్పష్టమైన సంకేతాలు పంపడం వల్ల తీరని నష్టమే కానీ రవ్వంత ప్రయోజనం లేదు. రాష్ట్రంలో కొన్ని మాసాలుగా నెలకొన్న అనిశ్చితిని తొలగించే బాధ్యత కేంద్రానిదే. బాధ్యతాయుతమైన, దూరదృష్టి కలిగిన, నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలోని రాజకీయ పక్షాలు మనస్ఫూర్తిగా సహకరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలుకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మౌనం కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది. పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నా, చేయిజారిపోతున్నా జోక్యం చేసుకోకపోవడం, చక్కదిద్దడానికి ప్రయత్నించకపోవడం క్షమార్హం కాని నేరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యాసదృశం అవుతుంది. ప్రజల పాలిట శాపం అవుతుంది.
(ఈ వ్యాసాన్ని hmtv సంపాదకీయం హంసధ్వని కోసం శ్రీ రామచంద్రమూర్తి గారు రాశారు. శ్రీ మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి.

Wednesday, January 5, 2011

నిస్సహాయ స్థితిలో "పాక్"‌ ప్రభుత్వం

పాకిస్తాన్ లో ఉదారవాదారినికీ, హేతువాదానికీ తావు లేని పరిస్థితులను మతవాదులు సృష్టిస్తున్నారు. సమాజంలో మతవాదుల ఆధిపత్యం వేగంగా, ప్రమాదకరంగా పెరుగుతోంది. ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. ఉదారవాదుల నోళ్ళు మూయించడానికీ, వారిని అణచివేయడానికి మతసంస్థలు పూనుకున్నాయి. ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నది. మంగళవారంనాడు పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్ దారుణ హత్య ఈ ధోరణికి తాజా నిదర్శనం. ఇందిరాగాంధీని అంగరక్షకుడు కాల్చి చంపినట్టే తసీర్ ను కూడా ఆయన అంగరక్షకుడు మలిక్ ముంతాజ్ హుస్సేన్ ఖాద్రీ అనేక విడతల కాల్పులు జరిపి హత్య చేశాడు. ఇందిర హంతకులదీ మతావేశమే. తసీర్ హంతకుడిదీ మతావేశమే.

పాకిస్తాన్ లో దైవదూషణ చట్టాన్ని సవరించాలని ఉదారవాదులు కొంతకాలంగా కోరుతున్నారు. దైవదూషణకు ఒడిగట్టిందనే ఆరోపణపై ఆసియా బీబీ అనే క్రైస్తవ మహిళకు నిరుడు నవంబరులో కోర్టు మరణశిక్ష విధించింది. చాలామంది ఉదారవాదులతో పాటు పంజాబ్ గవర్నర్ కూడా ఆసియా బీబీ కేసును తిరిగి సమీక్షించాలనీ, దైవదూషణ చట్టాన్ని సవరించాలని కోరాడు. షెక్ పురా జైలులో ఉన్న ఆసియా బీబీని కలుసుకొని సంఘీభావం ప్రకటించాడు. ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి వినతిపత్రం పంపించాడు. మతవాదులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తసీర్ తన వైఖరి మార్చుకోలేదు. దైవదూషణ చట్టానికి సవరణ తేవాలన్న వాదనకు వ్యతిరేకంగా మతవాదులు మంగళవారంనాడు ఇచ్చిన బంద్ పిలుపును వ్యతిరేకిస్తూ తసీర్ తన ట్విట్టర్ లో రాసుకున్నాడు. ‘దైవదూషణ చట్టం విషయంలో లొంగిపోవలసిందిగా నాపైన మతవాదుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. నేను లొంగిపోవడానికి నిరాకరించాను. ఇందుకోసం నిలబడిన చివరి మనిషిని నేను ఒక్కడినే అయినా సరే రాజీ ప్రసక్తి లేదు’ అంటూ తసీర్ తన హత్యకు కొన్ని గంటల ముందు ట్విట్టర్ లో నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.

పాకిస్తానీయుల మానసిక స్థితికి అద్దం పట్టే బ్లాగులనూ, ట్విట్టర్లనూ పరిశీలిస్తే ఆ దేశంలో ఉదారవాదులకూ, మతవాదులకూ మధ్య పోరాటం ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. ‘సల్మాన్ తసీర్ వెళ్ళిపోయాడు. కానీ ప్రతి వీధిలోనూ, ప్రతి మలుపులోనూ, ప్రతి వార్తా సంస్థలోనూ ఖాద్రీలు ఉన్నారు. పాకిస్తాన్ ను కేన్సర్ పీడిస్తోంది’ అంటూ ఒక ఉదారవాది తన బ్లాగ్ లో వాపోయాడు. కొన్ని వారాల కిందట పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య పౌరుల సంస్థ ‘సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ’ వెలిసింది. పాకిస్తాన్ లో ఫాసిస్టు వ్యవస్థను నెలకొల్పడానికి మతవాదులు హింసను ఆయుధంగా చేసుకున్నారంటూ ఈ సంస్థ వ్యాఖ్యానించింది. ఆసియా బీబీని హత్య చేసినవారికి యాభై వేల రూపాయల బహుమతి ప్రకటించిన ముల్లా పైన సర్కార్ ఎటువంటి చర్యా తీసుకోకపోవడాన్ని ఈ సంస్థ విమర్శించింది. దైవదూషణ చట్టాన్ని కనుక సవరిస్తే పాకిస్తాన్ లో ‘ఖూన్ కీ నదియా- నెత్తుటి నదులు’ పారుతాయంటూ ఆ ముల్లా హెచ్చరించాడు. మతవాదులకు పాలకుల మద్దతు ఉండటం, మతమే పాకిస్తాన్ రాజ్యానికి ఆయువుపట్టు కావడం వల్ల మతవాదులపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. దైవదూషణ చట్టానికి సవరణ చేయాలంటూ వాదిస్తున్న మరో ప్రముఖ పాకిస్తానీ రాజకీయవేత్త షెర్రీ రెహమాన్ భద్రత గురించి పౌరులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

తసీర్ ను హత్య చేసిన ఖాద్రీని హీరోగా పరిగణిస్తున్నవారి సంఖ్య తక్కువేమీ లేదు. ఖాద్రీ మద్దతుదారులు తాజాగా ఒక ఫేస్ బుక్ సృష్టించారు. అరెస్టు చేసిన ఖాద్రీని వెంటనే విడుదల చేయించేందుకు అవసరమైన నిర్ణయం ప్రకటించవలసిందిగా పాకిస్తాన్ సుప్రీకోర్టుకు వందలాదిమంది ఈ పేస్ బుక్ ద్వారా విజ్నప్తి చేస్తున్నారు. మతవాదులకూ, ఉదారవాదులకూ ఈ ఫేస్ బుక్ లో భీకరమైన వాగ్వాదం సాగుతోంది. పాకిస్తాన్ సమాజంలో నెలకొన్న సంక్షోభానికి ఈ ధోరణులు అద్దం పడుతున్నాయి. మతోన్మాదం, ఉగ్రవాదం. తాలిబాన్ ప్రభావం, ముల్లాల ఆధిపత్యం, మతవాదులకు రాజకీయ పార్టీల ప్రాధాన్యం, ఇస్లామీయ రాజ్యంగా పాకిస్తాన్ ను ప్రకటించడం వంటి అనేక చర్యల ద్వారా పాకిస్తాన్ పాలకులే ఇటువంటి ప్రమాదకరమైన ధోరణిని ప్రోత్సహించారు. నిజానికి ఈ రోజున సైతం పాకిస్తాన్ సమాజంలో మతవాదుల కంటే ఉదారవాదులే ఎక్కువ. కానీ రాజ్యం మద్దతు మతవాదులకు ఉండటం, మతవాదులకు తీవ్రమైన అభిప్రాయాలు ఉండటం, తమ వాదనతో ఏకీభవించనివారిని చంపివేయడమే విధానంగా నిర్ణయించుకోవడంతో పాకిస్తాన్ లో సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇది భారత ఉపఖండానికి ప్రమాద హేతువు.

(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి గారు.. hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 05-01-2011న రాశారు. శ్రీ మూర్తిగారి మరిన్ని hmtv సంపాదకీయ వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి)

Monday, January 3, 2011

తెలివిడి కాదు.. తెగింపు కావాలి

దేశాన్ని పాలించే వారికి కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. మనసుండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉండాలి. క్లిష్టమైన సమయాలలో తెగించి నిర్ణయాలు తీసుకొనే ధైర్యం ఉండాలి. నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. పరిపాలకులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకూడదు. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు ఇవ్వవచ్చు. అయినా సరే, ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. ఏ నిర్ణయమూ తీసుకోని పాలకులకు అధికారంలో ఉండే అర్హత లేదు. నిష్క్రియాపరత్వానికి మించిన ప్రమాదం మరొకటి లేదు. సమస్త జనులందరూ ఆమోదించే నిర్ణయాలంటూ ఎక్కడా, ఏ వ్యవస్థలోనూ ఉండవు. సకాలంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు జటిలమై సంక్షోభాలకు దారి తీస్తాయి. గతంలో దారి తీశాయి. వర్తమానంలో తీస్తున్నాయి.

పరిపాలన జ్యూతక్రీడ కాదు. ఒక పాచిక తర్వాత మరో పాచిక ప్రయోగించడం కాదు. దేశీయాంగ మంత్రి చిదంబరం తాజా పాచిక పారలేదు. ఆయన నాలుగు రోజుల కిందట ప్రయోగించిన పాచిక పాతదే. పాచిపోయినదే. సంవత్సరం క్రితం ఉపయోగించిందే. అంతకంటే భిన్నంగా, వినూత్నంగా, విశాలంగా ఆలోచించే సృజన కానీ, సాహసం కానీ హోమంత్రికీ, ప్రధానమంత్రికీ, వారిని నడిపిస్తున్న అధిష్ఠాన దేవతకీ లేకపోవడం అనర్థ హేతువు. ఈ వ్యాఖ్య తెలంగాణ సమస్యకి మాత్రమే పరిమితం కాదు. యూపీఏ ప్రభుత్వం కొన్నేళ్ళుగా అనేక సమస్యలపై ప్రదర్శిస్తున్న సాచివేత ధోరణికీ, అశక్తతకీ వర్తిస్తుంది. రెండేళ్ళ కిందటే నాటి టెలికాం శాఖ మంత్రి రాజాను అడ్డగోలుగా గడ్డితినకుండా అరికడితే ఈ రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ అవమానభారంతో తలవంచుకోవలసిన దుస్థితి దాపురించేది కాదు. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఇంత ఊపు వచ్చేది కాదు. మంత్రిమండలి నుంచి రాజాని తొలగించాలనే నిర్ణయం సకాలంలో తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టం కలిగిందో అందరికీ తెలుసు. సురేష్ కల్మాడీ నేపథ్యం తెలిసి కూడా ఆయనపైన నిఘా పెట్టాలన్న నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కామన్ వెల్త్ గేమ్స్ లో ఎంత అవినీతి జరిగిందో, దేశానికి ఎంత అపకీర్తి వచ్చిందో చెప్పనక్కరలేదు. జమ్మూ-కశ్మీర్ లో అయిదు మాసాలపాటు విద్యార్థులు బడులు వదిలి వీధులలోకి వచ్చి రాళ్ళు రువ్వడాలూ, భద్రతాదళాలు కాల్పులు జరపడాలూ జరిగిన మీదట అక్కడికి పార్లమెంటు సభ్యల కమిటీని పంపించడం మంచి నిర్ణయమే. ఆ కమిటీ తిరిగి వచ్చిన తర్వాత దాని కొనసాగింపుగా అంతకంటే ఉన్నత స్థాయి కమిటీని కానీ బృందాన్ని కానీ పంపితే సమంజసంగా ఉండేది. అట్లా చేయకుండా ఒక జర్నలిస్టునూ, ఒక అధ్యాపకురాలినీ, ఒక అధికారినీ పంపించడం, జమ్మూ-కశ్మీర్ లో తీరికగా పర్యటించి నివేదిక సమర్పించేందుకు వారికి ఒక సంవత్సరం వ్యవధి ఇవ్వడం క్షమార్హం కాని తప్పుడు నిర్ణయం.

తెలంగాణ విషయంలో సైతం ఒక అడుగు ముందుకు వేయడం, రెండు అడుగులు వెనక్కు వేయడం చందంగానే ఉంది దేశీయాంగ మంత్రి తీరు. నిరుడు జనవరి 5వ తేదీన రాష్ట్రం నుంచి ఎనిమిది గుర్తింపు కలిగిన పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిపంచడం వల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణవాదాన్నీ, సమైక్యవాదాన్నీ వినిపించాయి. దరిమిలా శ్రీకృష్ణ కమిటీని నియమించి, సంవత్సరంపాటు కాలక్షేపం చేశారు. కమిటీ నివేదిక అందిన తర్వాత తిరిగి ఎనిమిది పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించారు. ఇందువల్ల ప్రయోజనం ఏమిటో దేశీయాంగ మంత్రికే తెలియాలి. ఇంకా దాగుడు మూతలు ఆడాలని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరికొంత కాలం మౌనం పాటించాలనుకోవడం, రాష్ట్ర ప్రజలను గందరగోళంలో ఉంచాలనుకోవడం వ్యూహం అనిపించుకోదు. చేతగానితనం అనిపించుకుంటుంది. పిరికితనం అనిపించుకుంటుంది. దూరదృష్టి లేమి అనిపించుకుంటుంది. అవివేకం అనిపించుకుంటుంది. బాధ్యతారాహిత్యం అనిపించుకుంటుంది. దౌర్బల్యం అనిపించుకుంటుంది. బంతిని ప్రత్యర్థి కోర్టులోకి లాఘవంగా తన్నినందుకు చిదంబరం తనను తాను అభినందించుకుంటున్నారేమో తెలియదు. కానీ అఖిలపక్ష సమావేశాన్ని మరోసారి నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఆలోచనాపరులు ఎవ్వరూ స్వాగతించడం లేదు. తెలంగాణవాదులు మాత్రమే కాదు, సమైక్యవాదులు సైతం ఈ విషయంలో సంతోషంగా లేరు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించుకోవడంలో వింత లేదు. తెలుగుదేశం పార్టీ సైతం ఇదే నిర్ణయం తీసుకుంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా అఖిలపక్షం అక్కరలేదంటున్నారు. ఎవరితో నిర్వహిస్తారు అఖిలపక్ష సమావేశం? పీఆర్ పీ, సీపీఐ నాయకులతోనా?

ఇప్పుడు జరగవలసింది ఒక్కటే. శ్రీకృష్ణ కమిటీ నివేదికను విడుదల చేయాలి. ఆఖరికి ఈ సమస్యకు కావలసింది రాజకీయ పరిష్కారం కనుక సోనియాగాంధీ రంగప్రవేశం చేయాలి. కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కాదంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో పాటు, జాతీయ పార్టీల జాతీయ స్థాయి అధ్యక్షులను కూడా ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలి. సమస్యను అన్నికోణాల నుంచీ కూలంకషంగా చర్చించి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి. సమావేశం ఒకరోజు జరగవచ్చు. వారంరోజులు జరగవచ్చు. ఇబ్బంది లేదు. నిజాయితీగా, నిస్సంకోచంగా అన్ని విషయాలూ చర్చించి ఏకాభిప్రాయానికి రావాలి. అవసరమైతే అన్ని పక్షాలూ కొన్ని త్యాగాలు చేయాలి. రాజీపడాలి. సర్దుబాటు చేసుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటికి అన్ని పార్టీలూ విధిగా కట్టుబడి ఉండాలి. ప్రజలకు వివరించి, వారిని ఒప్పించే బాధ్యత కూడా అన్ని రాజకీయ పార్టీలూ తీసుకోవాలి. శాశ్వత పరిష్కారం సాధించాలి. రాష్ట్రాన్ని కొంతకాలంగా పట్టిపీడిస్తున్న అనిశ్చితి తొలగిపోవాలి. భవిష్యత్ చిత్రపటం స్పష్టంగా రూపొందించుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని శాంతయుతంగా, సామరస్యంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ పథకం రూపొందించాలి.

ఇంతకాలం ఆడిన ఆటలు చాలు. దాగుడుమూతలు చాలు. చేసిన విన్యాసాలు చాలు. వ్యూహరచన చాలు. వేసిన ఎత్తుగడలు చాలు. ప్రదర్శించిన నాటకీయత చాలు. వంచనశిల్పం చాలు. జరిగిన ప్రాణనష్టం చాలు. మనోవేదన చాలు. చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలనో, జగన్మోహన్ రెడ్డి ఆటకట్టించాలనో ఆలోచించి, తక్షణ ప్రయోజనాలు ఆశించి పాచికలాడటం మానుకోవాలి. నిజాయితీనీ, పారదర్శకతనూ ప్రజలు హర్షిస్తారని బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తాజాగా నిరూపించాయి. ప్రతిసారీ సమస్యను దాటవేస్తూ మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నిస్తే పాలకపక్షానికి ఆంధ్రప్రదేశ్ లో ఆబోరు దక్కదు. దక్షిణాదిన మిగిలిన ఒకే ఒక కోట కుప్పకూలుతుంది. ఇది తాజా ప్రమాద హెచ్చరిక.

(ఈ వ్యాసాన్ని hmtv చీఫ్‌ ఎడిటర్‌ శ్రీ రామచంద్రమూర్తిగారు hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 02.02.11న రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి.)


ప్రజల మనీషి.. కన్నబిరాన్‌


న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. రెండు చేతులా అదేపనిగా గడిస్తున్న క్రిమినల్ లాయర్లు ఉన్నారు. రాజకీయ నాయకుల ప్రాపకంతో న్యాయమూర్తులుగా పదవులు సంపాదించినవారున్నారు. ఆ పదవులను వినియోగించుకొని కోట్లకు పడగలెత్తినవారున్నారు. వీరిలో చాలామందిని సమాజం గౌరవించదు. ఇందుకు భిన్నంగా న్యాయంకోసం, ధర్మంకోసం మడమ తిప్పకుండా నిలిచి పోరాడి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నవారు బహుకొద్దిమంది ఉంటారు. అటువంటి సిసలైన ప్రజాన్యాయవాదులలో అగ్రగణ్యుడు గురువారంనాడు కన్నుమూసిన కన్నబిరాన్. న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చినవాడు, న్యాయవాద వృత్తిని సార్థకం చేసినవాడు కందాళ గోపాలస్వామి కన్నబిరాన్.

రాజ్యాంగ స్ఫూర్తిని బాగా వంటబట్టించుకున్న హక్కుల యోధుడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడమే కర్తవ్యంగా నిర్దేశించుకున్ననూటికి నూరు పాళ్ళు ప్రజాస్వామ్యవాది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై కత్తిదూసిన సమరశీలుడు. నిరుపేదలకూ, దుర్బలులకూ న్యాయభిక్ష పెట్టిన ధీశాలి. బడుగుల పక్షాన పోరాడే క్రమంలో పాదరసం వంటి బుర్రనూ, అపారమైన న్యాయశాస్త్ర పరిజ్నానాన్నీ, అద్భుతమైన వాక్పటిమనూ, అసాధారణమైన సమయస్ఫూర్తినీ, సహజసిద్ధమైన సత్యాగ్రహాన్నీ, నిరుపమానమైన నిర్భీతినీ ఆయుధాలుగా చేసుకున్న అతిరథుడు. విచారణ లేకుండా జైళ్ళలో మగ్గుతున్న వందలాదిమందికి విముక్తి ప్రసాదించిన పేదలపాలిట దేవుడు.

ఆంధ్రప్రదేశ్ లో హక్కుల కార్యకర్తలపైనా, విరసం నాయకులపైనా, బడుగువర్గాలకు చెందిన అనేక మందిపైనా పోలీసులు పెట్టిన కుట్రకేసులను తన వాదనతో పటాపంచలు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులలో కన్నబిరాన్ డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించారు. పార్లమెంటు మీద ఉగ్రవాదుల దాడి కేసులో, కోయంబత్తూరు బాంబు పేలుళ్ళ కేసులో, మదురైలో ఆర్ ఎస్ ఎస్ భవనం పేల్చివేత కేసులో, వీరప్పన్ అనుచరులపైన టాడా కేసులో, తమిళ పులుల నాయకుడు కిట్టూ కేసులో ఆయన వాదించారు. కారంచేడు, చుండూరు వంటి కేసులలోనూ, రామనగర్ కుట్ర కేసుల వంటి కేసులలోనూ తాను వాదించడమే కాకుండా అటువంటి కేసులలో వాదించడానికి అనేకమంది యువన్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్నవారి రాజకీయ సిద్ధాంతాలతో, నేపథ్యంతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును కాపాడటంకోసం జీవితం అంకితం చేసిన న్యాయవాది కన్నబిరాన్.


రాజకీయ పార్టీలతో కానీ సైద్ధాంతిక విభేదాలతో కానీ ప్రమేయం లేకుండా ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించేవారు. ఆత్యయిక పరిస్థితిలో అన్ని పార్టీల నాయకుల పరఫునా అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసి వాదించారు. చమత్కార భాషణంలో, వాగ్బాణాలు సంధించడంలో, ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని తునాతునకలు చేయడంలో కన్నబిరాన్ ది ప్రత్యేక శైలి. రౌడీషీటర్ గా పేరుమోసిన కొత్తదాస్ తరఫున వాదించడాన్ని ఆక్షేపించిన ఒక న్యాయమూర్తితో ‘ఎవరికి తెలుసు మిలార్డ్, ఆయన ఏదో ఒక రోజున మన ముఖ్యమంత్రి కావచ్చు’ అంటూ కన్నబిరాన్ చేసిన వ్యాఖ్య నేరప్రపంచానికీ, రాజకీయరంగానికీ మధ్య బలపడుతున్న అపవిత్రబంధంపైన ఖడ్గప్రహారం.


రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా కన్నబిరాన్ సహించేవారు కాదు. ప్రధాని కావచ్చు. ముఖ్యమంత్రి కావచ్చు. ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. న్యాయవాది కావచ్చు. ఐఏఎస్ అధికారి కావచ్చు. బడా పారిశ్రామికవేత్త కావచ్చు. కార్మిక నాయకుడు కావచ్చు. నక్సలైటు లేదా మావోయిస్టు కావచ్చు. ఎవ్వరినీ వదిలేది లేదు. అవతలి వ్యక్తి హోదా కానీ, సంపద కానీ, నేపథ్యం కానీ ఆయనపై ప్రభావం వేసేవి కావు. భయమూ, వెరపూ లేని నైజం ఆయనది. రాజ్యాంగ పీఠికనూ, ప్రాథమిక హక్కులనూ, ఆదేశిక సూత్రాలనూ త్రికరణశుద్ధిగా పాలకులూ, పౌరులూ గౌరవించడం ప్రజాస్వామ్యంలో పరమావధి అన్నది ఆయన ప్రగాఢమైన విశ్వాసం. కన్నబిరాన్ ఎవరి తరఫున వాదించినా, ఏమని వాదించినా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని జవదాటిన సందర్భం లేదు. బూటకపు ఎన్ కౌంటర్ ను ఏ విధంగా వ్యతిరేకించేవారో ఇన్ ఫార్మర్ అనే ఆరోపణతో పౌరులను నక్సలైట్లు చంపివేయడాన్నీ, ఎత్తుగడగా ప్రముఖులను అపహరించడాన్ని కూడా అంతే గట్టిగా వ్యతిరేకించేవారు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణులకూ, పోలీసు వ్యవస్థ దాష్టీకానికీ, బలవంతుల అక్రమాలకూ, దౌర్జన్యాలకూ, అత్యాచారాలకీ వ్యతిరేకంగా పోరాడటంలో రాజీపడని న్యాయవాది కన్నబిరాన్. అన్యాయానికి గురి అయిన పేదవారి తరఫున వకాల్తా తీసుకొని ఫీజు లేకుండా వాదించడం, న్యాయం జరిగేవరకూ పోరాడటం ఆయనను పేదల పాలిట పెన్నిధిని చేశాయి. ముఖ్యంగా పౌరహక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్న కార్యకర్తలను పోలీసులు నిర్బంధించిన సందర్భాలలో, వేధించిన సమయాలలో బాధితులకు కన్నబిరాన్ కొండంత అండగా నిలిచారు. అందుకే ఆయనను హక్కుల ఉద్యమానికి పెద్ద దిక్కుగా అభివర్ణించడం, అభినందించడం, ఆరాధించడం.

పదహారు మాసాలలో ముగ్గురు దీనజనబాంధవులు మరణించారు. బాలగోపాల్, శంకరన్, కన్నబిరాన్. ముగ్గురూ ముగ్గురే. మహోన్నతులు. పేదలకోసం, పీడితులకోసం, తాడితులకోసం జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసిన మహానుభావులు. ఎవరి మార్గంలో వారు మానవీయ విలువలకు పట్టం కట్టినవారు. అటువంటి వ్యక్తులు అరుదుగా ఆవిర్భవిస్తారు. విపణి ప్రేరిత ఆర్థిక విధానాలు రాజ్యం చేస్తున్న తరుణంలో సమష్టితత్వం, సంఘీభావం, ఉద్యమస్వభావం లుప్తమౌతున్న రోజులలో, మనిషినీ, మానవత్వాన్నీ గాలికి వదిలి స్వార్థ ప్రయోజనాలనూ, కాసునూ కొలిచే హీన సంస్కృతి బలపడుతున్న పాడుకాలంలో మరో కన్నబిరాన్, మరో బాలగోపాల్, మరో శంకరన్ మన నేలపైన తిరుగాడుతారా? పౌరహక్కులనూ, మానవహక్కులకూ, మానవీయ విలువలకూ పూచీగా నిలబడతారా? కన్నబిరాన్ వదిలి వెళ్ళిన కాడిని భుజాన వేసుకుంటారా? అధోజగత్సహోదరులనూ, ప్రజాస్వామ్యవాదులనూ, మానవతావాదులనూ వేధిస్తున్న ప్రశ్నలివి.


(శ్రీరామచంద్రమూర్తి గారు, ఈ వ్యాసాన్ని hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 02-01-11న రాశారు. వీరి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి)

Saturday, January 1, 2011

సర్వే జనా సుఖినోభవంతు

సాటి బ్లాగర్లకు.. పాఠకులకు










వత్సరాది శుభాకాంక్షలు

ఈ ఏడాది మీ అందరి జీవితాలు
అష్టైశ్వర్యాలు.. భోగభాగ్యాలతో
తులతూగాలని
వర్ణ రంజితం కావాలని
మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను

మీ...
విజయ్‌