Saturday, August 28, 2010

అమ్మకు సర్వనామమే తెలుగు..

తెలుగు.. ఈ పదం వినగానే, అమ్మచేతి గోరుముద్ద తిన్న చిన్ననాటి ఆనందం.. చెప్పిన మాట వినలేదని వీపున బాజా మోగించిన అమ్మ చేతి తాడనం.. తమ్ముడికి లాలనగా ఉగ్గాముదం పట్టిస్తున్న అమ్మ చెంగును, చాటుగా చేసుకుని ఆసక్తిగా చూసిన జ్ఞాపకం.. అ... అమ్మ, ఆ.. ఆవు అంటూ సాగించిన అభ్యాసం.. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి తరగతిలోనూ 80కి పైగా మార్కులు సంపాదిస్తూ.. దాన్నే ఆనవాయితీగా మార్చుకున్న నన్ను చూసి తెలుగు మాస్టారు మధుసూదన్ రెడ్డి గారు శభాష్ అంటూ మెచ్చుకున్నప్పుడు నాలోని గర్వం.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో గుర్తులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఒక్క పదం నాలో ఇన్ని భావాలకు, ఉద్వేగాలకు కారణమవుతోందా..? ఆ పదం వింటే అమ్మ గుర్తుకు రావడం ఏంటి..? చిన్ననాటి విశేషాలన్నీ బుర్రలో గిర్రున తిరగడమేంటి..?

అవును.. ఆ పదానికి నాకు విడదీయరాని బంధం.. అమ్మకు నాకు ఉన్న కమ్మని అనుబంధం.. అందుకే అంటాను.. అమ్మకు సర్వనామమే ఆ పదం. అందుకే తెలుగు అన్న మూడక్షరాల ఆ పదం నాకు మాతృభాష అయింది. నాతోనే రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

రేపు (ఆగస్టు 29వ తేదీ) తెలుగు భాషా దినోత్సవం అనగానే, నా మదిలో మెదిలిన అందమైన అనుభూతిని తెలిపేదే ఈ అక్షరమాలిక.

ఇక్కడ ఓ రెండు ముచ్చట్లు :

నేను పనిచేస్తున్న టీవీలో... వార్తల ముఖ్యాంశాల (News Headlines)కు తోక పదాలు లేదా పదబంధాలు (టెయిల్ ట్యాగ్) రాయడం ఆనవాయితీ. ఆ తోకపదాలు అచ్చమైన తెలుగులో ఉండాలన్నది నా భావన. అందుకే వీలైనంత వరకూ తెలుగు పదాలు లేదా పదబంధాలు రాస్తుంటాను. అయితే ఒక సహచరోద్యోగి వచ్చి.. ఆ పదాలు ఎవరికి అర్థమవుతాయి..? చక్కగా అందరికీ అర్థమయ్యేలా వాడుక భాష (అతడి ఉద్దేశంలో ఆంగ్ల పదాలు) రాయొచ్చు కదా అన్నాడు. ఎవరికీ అర్థం కావు అని తెలుగు పదాలను రాయడం మానేస్తే ఇక తెలుగు భాష చచ్చిపోదా..? మనం తెలుగు వాళ్లమైనందుకు అమ్మభాషను చంపేద్దామా అంటూ నిలదీసేసరికి అతను మౌనంగా వెళ్లిపోయాడు. (ఈ ఘటన తర్వాత ఏదైనా తెలుగు పదాలకు అర్థం తెలియకుంటే నాదగ్గరికే వస్తున్నాడనుకోండి..)

అందుకే నా బృందంలో పనిచేసే ప్రతివారికీ తెలుగు భాషలో తెలిసిన ప్రతీ పదాన్ని అర్థరహితంగా వాడొద్దని, అర్థం తెలిసుంటేనే వాడండి అని చెపుతుంటాను. ఒకవేళ వాడాలనుకున్న ఏ పదానికైనా అర్థం తెలియకుంటే సీనియర్ల నుంచి తెలుసుకోండి.. లేదా డిక్షనరీని చూసి అర్థం తెలుసుకుని వాడండి అని చెపుతాను. ఆ విధంగానైనా వర్తమాన జర్నలిస్టులకు తెలుగు భాష అలవాటవుతుందన్నది నా నమ్మకం.

పోతే (ఎవరు పోతే అని ప్రశ్నించకండి మహా ప్రభూ..), రాజధాని హైదరాబాద్ లో రేపు (29-08-2010) తెలుగును సుసంపన్నం చేసేందుకు ఓ చిరు ప్రయత్నం జరుగుతోంది. "తెలుగు బాట" పేరిట పాదయాత్ర జరగబోతోంది. ఉదయం ఎనిమిది గంటలకు సచివాలయం దగ్గరున్న తెలుగుతల్లి విగ్రహం నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకు పీవీ జ్ఞానభూమి దాకా ఈ యాత్ర సాగుతుంది. రండి మనందరం ఈ అడుగుల్లో అడుగు కలుపుదాం.. మన అమ్మభాష తెలుగును సుసంపన్నం చేసుకుందాం.

1 comment:

  1. chala bagundhi sir.......konasaginchandi-----


    ----manthaiah-adilabad9441169086

    ReplyDelete