
- దేశంలోనే పేద ముఖ్యమంత్రి
- బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే
- అఫిడవిట్లో వెల్లడి
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. దేశంలోనే అత్యంత నిరుపేద ముఖ్యమంత్రి. వినడానికి కాస్తంత విడ్డూరంగా
ఉన్నా... ఇది అక్షరాలా నిజం. ఆయన చేతిలో ఇప్పుడున్న నగదు కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా.. నమ్మిన సిద్ధాంతాలకోసమే సంపాదనను ఖర్చు చేస్తోన్న ఆదర్శ రాజకీయవేత్త మాణిక్ సర్కార్.
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్సర్కారు.. తనదైన విభిన్నశైలితో.. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం దక్కితేనే.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడబెట్టే ఈ రోజుల్లో.. నమ్మిన సిద్ధాంతాలతోనే.. ముఖ్యమంత్రి హోదాలోనూ నిజాయితీతో.. స్వచ్ఛంగా.. జీవిస్తున్నారు మాణిక్ సర్కార్.
త్రిపుర రాష్ట్రానికి 1998లో తొలిసారి ఎన్నికైన మాణిక్ సర్కార్.. అప్రతిహతంగా ఐదు పర్యాయాలూ ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల వేళ... ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో.. తనవద్ద కేవలం తొమ్మిది వేల ఏడువందల రూపాయలు మాత్రమే నగదు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా.. అప్పట్లోనే.. దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో జరుగుతోన్న ఎన్నికల్లో మాణిక్సర్కార్ ధన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేసందర్భంలో.. ఆయన ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్ను సమర్పించారు. అందులో.. తన బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అంటే, 2013 ఎన్నికల నాటితో పోలిస్తే.. ఆయన వద్దనున్న బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా తగ్గిపోయింది. అంటే గడచిన ఐదేళ్లలో ఆయన మరింత పేదవాడిగా మారిపోయారని అర్థమవుతోంది.
సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగుతోన్న మాణిక్ సర్కార్.. ముఖ్యమంత్రిగా తనకు వచ్చే వేతనం 26వేల 315 రూపాయలను పార్టీ నిధుల కిందే జమ చేస్తూ వస్తున్నారు. తన జీవనానికి గాను, పార్టీ నుంచి ప్రతి నెలా 9వేల ఏడు వందల రూపాయలు పొందుతున్నారు. మాణిక్ సర్కార్ సతీమణి పాంచాలి భట్టాచార్జీ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి. ఆమె చేతిలో మాత్రం 20వేల నగదు ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో వచ్చిన పన్నెండు లక్షల 15వేల రూపాయల నగదు ఆమె బ్యాంకు ఖాతాలో ఉంది.
మాణిక్సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ... అతి సాధారణవ్యక్తి మాదిరిగా జీవిస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్కు కనీసం మొబైల్ ఫోన్ కూడగా లేదు. బయటికి వెళ్లేప్పుడు, రిక్షాల్లోనూ.. రైల్వే జనరల్ కంపార్ట్మెంట్లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయాలు అనగానే.. దోపిడికి దగ్గర దారి అని భావించే ఎందరో నాయకులకు.. మాణిక్ సర్కార్ నిబద్ధత.. జీవనశైలి నిస్సందేహంగా ఆదర్శప్రాయమే.